: గత కొన్నేళ్లుగా భారత్‌లో పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. డిజిటలైజేషన్, స్టాక్ మార్కెట్ల పట్ల అవగాహన పెరగడం, అరచేతిలోనే స్టాక్స్ పెరుగుదల-తగ్గుదల తెలుసుకోవడం.. తోటి వారు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడంతో అందరికీ స్టాక్ మార్కెట్లపై దృష్టి పడేలా చేసింది. అంతేకాకుండా కొన్ని స్టాక్స్ అద్భుతం చేసి.. వేలు పెడితే లక్షలు రావడంతో.. చాలా మందికి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనే కోరిక నెలకొంది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో భారీగా పెరిగాయి. అయితే తాజాగా స్టాక్ గ్రో, 1 లాటిస్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఇండెక్స్-2025 రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ ఐబీఐ రిపోర్ట్ ప్రకారం.. ఈ సంస్థలు సర్వే నిర్వహించగా.. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 81 శాతం మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. ఆర్పీఐ ఫైనాన్షియల్ లిటరసీ వీక్-2025లో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో 50 వేల మంది పాల్గొన్నారు. ఇందులో వారు పెట్టుబడులు పెట్టే విధానం, ఏ స్టాక్స్‌పై ప్రాధాన్యం చూపిస్తున్నారనేది వెల్లడించారు. అయితే భారత్‌లో 35 ఏళ్ల లోపు ఉన్న యువత స్టాక్ ఇన్వెస్టర్లుగా మారుతున్నట్లు తెలిసింది. ఈ 35 ఏళ్లు లోపు పెట్టుబడులు పెట్టే యూత్‌లో 45 శాతం మంది బ్యాంకులు, ఇతర మార్గాలు కాకుండా.. స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇందుకు ప్రధాన కారణాలు యువతలో పెరుగుతున్న ఆర్థిక అవగాహన, ఆన్‌లైన్‌లో డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్‌ను అందుబాటులో ఉండటం అని తెలుస్తోంది. అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగినప్పటికీ.. వారికి ఆర్థిక అవగాహన సరిగా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. స్టాక్ మార్కెట్ల గురించి ఎలాంటి నాలెడ్జ్ లేక 42 శాతం మంది పెట్టుబడి పెట్టకపోవడానికి అసలు కారణం అని తెలుస్తోంది. ఇక పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే మార్గదర్శకత్వం కోసం మరో 44 శాతం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక 68 శాతం మంది ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడులు ఎలా పెట్టాలి అని ఆర్థిక పాఠాలు నేర్చుకుంటున్నారని ఈ నివేదికలో తేలింది. మరోవైపు.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారిలో సగం మంది.. మొదట వర్చువల్ ట్రేడింగ్ ద్వారా మార్కెట్‌ ఎలా ఉంది అనేది అర్థం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇన్వెస్టర్ బిహేవియర్ ఇండెక్స్-2025 భారత రిటైల్ ఇన్వెస్టర్లలో వచ్చిన సంచలన మార్పును తెలియజేస్తోందని స్టాక్‌గ్రో వ్యవస్థాపకుడు, సీఈఓ అజయ్ లఖోతియా వెల్లడించారు. భారత యూత్ స్టాక్ మార్కెట్‌ను నమ్మడమే కాకుండా.. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అయితే వారికి ఇంకా ఆర్థిక అవగాహన అత్యవసరమని పేర్కొన్నారు. సెబీ రిజిస్టర్డ్ కన్సల్టెంట్ల సాయంతో స్టాక్‌గ్రోలో పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే భారత్‌లో యువ పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందులో మహిళల పాత్ర తక్కువగా ఉన్నట్లు ఐబీఐ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారిలో కేవలం 10.1 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని తెలిసింది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. 34 శాతం మంది మహిళలు వచ్చే ఏడాదిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సర్వేలో భాగంగా 51శాతం మంది ఇన్వెస్టర్లు.. మార్కెట్ పడిపోతుందనే భయంతో ఉన్నారని.. మరో 36 శాతం మంది యాక్టివ్ ఇన్వెస్టర్లకు ఏడాది కంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉందని తెలిసింది. ఇక 41శాతం మంది కొత్త ఇన్వెస్టర్లు.. తమకు సరైన మార్గదర్శకత్వం ఉంటే.. మార్కెట్‌లో పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారని ఈ ఐబీఐ రిపోర్టు తెలిపింది.