హైదరాబాద్ వాసులకు మహా శివరాత్రి కానుక అందించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. నగరంలో గత కొన్నేళ్లుగా నిర్మాణ దశలో ఉన్న అంబర్ పేట ఫ్లైఓవర్ ఎట్టకేలకు పూర్తయిన నేపథ్యంలో.. రేపటి (ఫిబ్రవరి 26) నుంచి అందుబాటులోకి రానున్నట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు. అంబర్ పేట ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి రాకపోకలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు (ఫిబ్రవరి 25న) ఉదయం అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను కిషన్ రెడ్డి పరిశీలించారు. గోల్నాక నుంచి అంబర్‌పేట ఇరానీ హోటల్ వరకు ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. చాదర్ ఘట్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారికి.. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు విస్తరణ చేశారని.. కానీ అంబర్‌పేట ఛే నెంబర్ వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండటం వల్ల రోడ్డు విస్తరణ కుదరలేదని తెలిపారు. తాను అంబర్ పేట శాసనసభ్యుడిగా, ఎంపీగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. శ్మశాన వాటిక ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరానని చెప్పుకొచ్చారు. ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుందని.. స్థానిక ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారని తెలిపారు. ఈ జాతీయ రహదారి గుండా వెళ్లే వరంగల్, ఖమ్మం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడగ్గా.. ఆయన వెంటనే ఒప్పుకొని మంజూరు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఫ్లైఓవర్‌ కింద రెండు వైపులా స్మశాన వాటికలు ఉండటం వల్ల.. రోడ్డు విస్తరణ ఇబ్బందిగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. అంబర్‌పేట ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మిగతా ఐదు చోట్ల భూసేకరణ చేసి రోడ్డు విస్తరణకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకచోట భూసేకరణకు సంబంధించి రూ.2 కోట్ల 51 లక్షలు చెక్కు తీసుకున్న తర్వాత కూడా స్థలం నేషనల్ హైవే అథారిటికి అప్పగించలేదని గుర్తుచేశారు. దాన్ని త్వరగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.జీహెచ్ఎంసీ, నేషనల్ హైవే అధికారులతో ఇటీవల తాను ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లైఓవర్ కింద మంచి రోడ్డు వేయడంతో పాటు, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ చేయాలని అధికారులను సూచించినట్టు తెలిపారు. అయితే.. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సాధ్యం కాదని చెప్పారని వెల్లడించారు. ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ట్రాఫిక్‌ను పైనుంచి పంపిస్తూ.. కింద రోడ్డు, బ్యూటిఫికేషన్ పనులు చేయాలని అధికారులకు సూచించినట్టు విరరించారు. కాబట్టి మిగిలిపోయిన చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి నేషనల్ హైవే అథారిటికి అప్పగిస్తే ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ శివరాత్రి నుంచి ఫ్లైఓవర్ మీనుంచి ట్రాఫిక్ వదిలి.. కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఫ్లైఓవర్కు సంబంధించి తాను గతంలో కేసీఆర్‌కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనేక ఉత్తరాలు రాసినట్టు తెలిపారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని కోరారు. ఈ ఫ్లైఓవర్ కోసం ఇప్పటి వరకు రూ.338 కోట్లు ఖర్చు చేసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలకు శివరాత్రితో కొంత ఉపశమనం కలుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.