తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రైతులకు రైతుభరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేసింది. త్వరలోనే చేనేత రుణాలు సైతం మాఫీ చేస్తామని స్పష్టం చేసింది. తాజాగా.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.3 వేల కోట్లతో స్వయంఉపాధి పథకాలను తీసుకొస్తామంది. ఈ మేరకు విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రానున్న రెండు నెలల్లో ఈ పథకాలు అమలు చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాల అమలు కోసం సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సంక్షేమ శాఖల్లోని హాస్టల్స్, గురుకులాలకు సంబంధించిన అద్దెలు, డైట్‌ బిల్లులు పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని స్పష్టం చేశారు. పోడు భూముల్లో సోలార్‌ పవర్‌ ఆధారంగా సాగు విస్తీర్ణం కూడా పెంచాలన్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు రైతులకు మేలు జరిగేలా కొత్తగా అవకాడో, వెదురు వంటి పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండేళ్లలో ఫలితాలు వచ్చేలా చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖల్లో పథకాల అమలు కోసం ఎన్ని నిధులైనా ఖర్చుచేస్తామని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.3 వేల కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గురుకులాలు, హాస్టల్స్ పెండింగ్‌ బిల్లులపై సంబంధిత అధికారులు బాధ్యత తీసుకుని ఆర్థికశాఖ నుంచి ఎప్పటికప్పుడు వీటిని మంజూరు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల ఖర్చుకు వినియోగపత్రాలు సమర్పించి, వెంటనే నిధులు రాబట్టాలన్నారు. సంక్షేమ గురుకులాలు, హాస్టల్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారుల పర్యటనలు నిరంతరం కొనసాగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల ఖర్చుపై అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు ఆలస్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు.