ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

Wait 5 sec.

: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ రంగంలో కొలువుల జాతర ఉంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్-నాస్కామ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2024-2025 ఆర్థిక ఏడాదితో పోల్చితే.. ఈ 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో రెట్టింపు ఉద్యోగాల భర్తీ ఉంటుందని వెల్లడించింది. గతేడాది 60 వేల ఉద్యోగాలు మాత్రమే సృష్టించగా.. అది ఈ ఏడాది ఏకంగా 1.25 లక్షలకు పెరిగి రెట్టింపు కానుందని నాస్కామ్ రిపోర్ట్ వెల్లడించింది. అదే సమయంలో ప్రస్తుతం భారత టెక్ రంగంలో దాదాపు 58 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే గత ఆర్థిక ఏడాదిలో దాదాపు 2.50 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు ఉంటాయని అంచనా వేసిన అది కేవలం 60 వేలకే పరిమితం అయింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగంలో 54.30 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 56.74 లక్షలకు సవరించింది. 2026 ఆర్థిక ఏడాది చివరి నాటికి ఆదాయం 300 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ టెక్ పరిశ్రమ 5.1 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. దీంతో ఈ రంగంలో మొత్తం ఆదాయం 282.6 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది.ఐటీ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు, ఈ-కామర్స్‌ కంపెనీలన్నీ ఐటీ ఇండస్ట్రీలో భాగమే. అయితే ఆయా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకోవడం, అజెంటిక్‌ ఏఐకి గిరాకీ, జీసీసీల సంఖ్య పెరుగుతుండడం వంటివి ఐటీ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, రిటైల్‌ రంగాల్లోకి డిజిటల్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశించడం ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతోందని పేర్కొంటున్నారు. ఇక ఐటీ పరిశ్రమలో ఆదాయ వృద్ధి సరైన దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో 4 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిసింది. 2025-26 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగ ఆదాయం 300 బిలియన్ డాలర్లను అధిగమించాలంటే 6.1 శాతానికి పైగా వృద్ధి అవసరమవుతుందని నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్‌ నంబియార్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ట్యాక్స్‌ భయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నా.. ఐటీ రంగం ఆదాయం సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నారు.