వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు

Wait 5 sec.

: వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు అనంతపురంలో ఉన్న గోరంట్ల ఇంటికి వెళ్లారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును.. ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 35/3 ప్రకారం.. గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్ 72, 79 సెక్షన్ల కింద గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేశారు. గతేడాది నవంబర్ 2వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్‌పై కేసులు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న బాలిక పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో భారీగా వైసీపీ శ్రేణులు ఆయన ఇంటికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంది.ఇక తనకు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై.. కూటమి ప్రభుత్వంపై గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు చేసేవి గుర్తు పెట్టుకోండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు సవాల్ విసిరారు. త్వరలోనే రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి.. వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని పెట్టిన కేసు ఇది అని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను, హక్కును కూటమి ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రమంతటా భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని.. అయితే ఆరోజు తనకు వేరే షెడ్యూల్ ఉంటే.. మరోరోజు వస్తానని కోరుతానని చెప్పారు. లేకపోతే అదే రోజు తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరవుతానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.