న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Wait 5 sec.

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ రావడంతో రోమ్‌కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. రోమ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపినట్టు పేర్కొంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానం AA292 మొత్తం 199 మంది ప్రయాణికులతో న్యూయార్క్‌ నుంచి భారత్‌ రాజధాని న్యూఢిల్లీకి ఫిబ్రవరి 22న బయలుదేరింది. మార్గమధ్యలో విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపులు రావడంతో ఇటలీ రాజధాని రోమ్‌‌లోని లియోనార్డ్ డా విన్సీ రోమ్ ఫియుమిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేసినట్టు అధికారులు తెలిపారు. విమానం సురక్షితంగా రోమ్‌లో దిగినట్టు ఏబీసీ న్యూస్ వివరించింది. ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణికుల రక్షణ, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. అంతేకాదు, పరిస్థితిని అర్ధం చేసుకున్న మా కస్టమర్లకు ధన్యవాదాలు అని తెలిపింది. బాంబు బెదిరింపులు రావడంతో రోమ్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరేందుకు ప్రోటోకాల్ ప్రకారం ఇటలీ రెండు యుద్ధ విమానాలను దానికి రక్షణగా పంపారు. అత్యవసర ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలు నిర్వహించారు. అయితే, దీని కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని ఏఎఫ్‌పీ తెలిపింది. ‘భద్రతా సమస్యను పైలట్ నివేదించిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ధ్రువీకరించింది.అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం A292 విమానం న్యూయార్క్‌ జాన్‌ ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్ట్ నుంచి శుక్రవారం రాత్రి 8.14 గంటలకు బయలుదేరింది. అయితే, బాంబు పెట్టినట్టు బెదిరింపులు రావడంతో స్థానిక కాలమానం ప్రకారం ఇటలీలో సాయంత్రం 5.30 గంటలకు ల్యాండ్ అయ్యింది. బోయింగ్ 787-9కు రెండు యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, తనిఖీల అనంతరం ఆ విమానం అక్కడ నుంచి బయలుదేరిందా? మరో విమానంలో ప్రయాణికులను పంపారా? లేదంటే వాళ్లంతా అక్కడే చిక్కుకున్నారా? అనేది మాత్రం స్పష్టత లేదు. దీని గురించి ఎయిర్‌లైన్స్ గురించి ప్రకటన చేయలేదు. గతేడాది అక్టోబరులో భారత్‌‌లో దేశీయ, విదేశీ సర్వీసులకు వందల్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటి వెనుక అమెరికాలోని ఖలీస్థాన్ల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.