తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా ఫోర్త్ సిటీ నిర్మాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీని నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులు, మౌళిక సౌకర్యాలు ఫోర్త్ సిటీలో కల్పించనున్నారు. అందులో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రోను నిర్మించనున్నారు. 40 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి చేరుకునేలా డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు (HAML) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రోరైలు విస్తరణ ప్రణాళికను అధికారులు రెడీ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మీర్‌ఖాన్‌పేటలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ వరకు జరుగుతున్న సర్వే పనులను ఆదివారం హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి దాదాపు 40 కి.మీ.దూరం ఉంటుందని చెప్పారు. టర్మినల్‌ నుంచి మొదలై.. కొత్తగా చేపట్టే మెట్రో ట్రైన్ డిపో సమీపం నుంచి ఎయిర్‌పోర్టు సరిహద్దు గోడ వెంబడి మెట్రో మార్గం కొంత భూమార్గంలో, మరికొంత ఎలివేటెడ్‌గా నిర్మించనున్నట్లు చెప్పారు. బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నారు. అక్కడ 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మెట్రోను డెవలప్ చేయనున్నారు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్‌ మీదుగా రావిర్యాల ఎగ్జిట్‌ వరకు 14 కి.మీ. పొడవున మెట్రో ఎలివేటెడ్‌ మార్గం నిర్మించున్నారు. రావిర్యాల నుంచి కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌ పేట వరకు మెుత్తంగా 22 కి.మీ. దూరం ఉంటుంది. ఇందులో 18 కి.మీ. వరకు భూమార్గంలోనే మెట్రో ట్రైన్ మార్గం నిర్మించనున్నారు. ఇక్కడ హెచ్‌ఎండీఏ 100 మీటర్ల వెడల్పున గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మిస్తుండగా.. రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రోరైలుకు కేటాయించారు. ఇందులో మెట్రోని భూమార్గంలోనే నిర్మిస్తారు. మెుత్తం ప్రతిపాదిత స్టేషన్ల సంఖ్య 16 కాగా.. భూమార్గంలో 18 కి.మీ నిర్మించునున్నారు. త్వరలోనే డీపీఆర్ తయారు చేసి మార్చి నెలాఖరుకు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి సమర్పిస్తామని ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. కాగా, పలు గ్రామాల మీదుగా మెట్రో నిర్మిస్తుండగా.. ఆ ప్రాంతాల్లో ఊహించనంత అభివృద్ది జరగనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు రాగా.. వాటికి డిమాండ్ మరింత పెరగనుంది.