తిరుమల శ్రీవారి దర్శనాలపై జాగ్రత్త.. కఠిన చర్యలు తప్పవు.. టీటీడీ సీరియస్ వార్నింగ్

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించిన దర్శనాల అంశంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఓ వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనాల పేరుతో భక్తుల్ని మోసం చేస్తున్నట్లు అలర్ట్ చేశారు. శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చలామణి అవుతూ ఛైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుంచి శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ రాజు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం: 18/2025తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుంచి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నకిలీ వెబ్ సైట్లను.. సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే దర్శనం.. వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. భక్తులు ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టిటిడి ఈవో జే శ్యామల రావు తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంలతో కలసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీవేంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా శ్రీనివాస కళ్యాణాన్ని చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు గడుపులోపు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాలు గడువు ఉండడంతో టిటిడి అధికారులు క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కల్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాలలో విసృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కళా బృందాలు, ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు, అన్నప్రసాదాలు పంపిణీ ఏర్పాట్లు చేయాలని కోరారు.