ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. భూసేకరణ, సర్వే, ఇతర పనులు నడుస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో కీలకమైన విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమానాశ్రయం మొదటి విడత కింద రూ.4,650 కోట్లతో జీఎమ్మార్‌ అక్కడ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2026 జూన్‌ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని జీఎమ్మార్ చెప్పినా.. జనవరి నాటికే పూర్తి చేయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిర్మాణ పనులపై సమీక్ష చేస్తున్నారు. ఎన్‌హెచ్‌16 నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు రోడ్డును లింక్ చేసే పనిలో ఉన్నారు. దీని కోసం భోగాపురం మండలంలో ఆయా గ్రామాల పరిధిలో 60.08 ఎకరాల భూమిని సేకరించారు అధికారులు.. ఇప్పటికే ఆ భూమిలో 20.22 ఎకరాలకు నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించారు. భోగాపురం మండలం పరిధిలోని సవరవిల్లిలో 39.86 ఎకరాలు సేకరించగా.. దీనికి సంబంధించి 45 మందికి చెల్లించాల్సిన రూ.19.89 కోట్ల పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే రావాడ, కవులువాడల్లో ప్రత్యామ్నాయ రోడ్లకు సంబంధించి 3.13 ఎకరాల తీసుకున్నారు.. 0.78 ఎకరాలకు సంబంధించి రూ.47.84 లక్షలు చెల్లించారు.. అయితే మిగిలిన రూ.3.19 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుుతన్నారు. గత నెలలో ముంజేరు దగ్గర ల్యాండ్‌ పార్శిల్‌-1 వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నారు.. ఈ మేరకు 1.11 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఈ మేరకు వారికి పరిహారం కింద రూ.71.25 లక్షల చెల్లించాల్సి ఉంది.అంతేకాదు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది నివాస హౌసింగ్ కాంప్లెక్స్ కోసం బసవపాలెం దగ్గర 24.30 ఎకరాలు గుర్తించారు. అలాగే 4.50 ఎకరాలను 132/33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి సేకరించారు.. దీనికి సంబంధించి పరిహారం ప్రభుత్వం రూ.70.21 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నేషనల్ హైవే నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు ట్రంపెట్‌ నిర్మాణానికి 19.75 ఎకరాల భూమిని సేకరించగా.. ఆ రైతులకు పరిహారంగా రూ.14.43 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే మరికొంత భూ సేకరణకు రూ.22 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌‌కు సంబంధించి ఫేజ్‌-1లో నీటి సరఫరాకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ట్రయల్‌రన్‌ పూర్తి చేశారు. మార్చి తొలి వారం నుంచి రోజూ 1.7 ఎంల్‌డీల నీటిని సరఫరా చేసేలా ప్లాన్ చేశారు. ఇక ఫేజ్‌-2లో నీటి సరఫరాకు జీఎమ్మార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.. 3.3 ఎల్‌ఎండీలు నీళ్లు అవసరమని తెలిపింది. అయితే ఈ నీళ్లను తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు మరింత వేగవంతం చేశారు.