ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 2 వేల మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై వేటు

Wait 5 sec.

పలు దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు, మానవతా సాయానికి యూఎస్‌ ఎయిడ్‌ (USAID) సంస్థ ద్వారా అందుతున్న నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ సంస్థలోని 2 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. మిగితావారిలో కొందర్ని మినహాయించి వేలాది ఉద్యోగులను బలవంతపు సెలవుపై పంపుతున్నట్లు యూఎస్‌‌ఎయిడ్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు విషయంలో ఫెడరల్‌ జడ్జి అనుమతుల తర్వాతే ట్రంప్‌ యంత్రాంగం ముందుకెళ్లింది. ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్‌ నికోలస్ తిరస్కరించారు. అనవసరపు వ్యయాలను తగ్గించి, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచేలా ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ (DOGE) ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయం మిగతా ఉద్యోగుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. యూఎస్‌ఎయిడ్‌పై ఇప్పటికే ఉగ్రవాదుల సంస్థగా ట్రంప్, మస్క్‌ ఆరోపణలు చేస్తూ.. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా దాదాపు 600 మంది సిబ్బందిని కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. అయితే, ఈ ఆదేశాలపై ఫెడరల్‌ జడ్జి అమీర్‌ అలీ గతవారం తాత్కాలికంగా స్టే విధించారు. యూఎస్‌ఎయిడ్‌ ద్వారా సాయం అందించడానికి అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కానీ, ట్రంప్‌ మాత్రం తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. భారత్‌ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి యూఎస్ఎయిడ్ ద్వారా బైడెన్ ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్‌ పదేపదే ఆరోపించారు. ఇకపై అటువంటి నిధులను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద బోల్డంత డబ్బుందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఇరుదేశాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు యూఎస్ఎయిడ్ గతేడాది ఎలాంటి నిధులు ఇవ్వలేదని తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖ నివేదిక స్పష్టం చేసింది.