: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా ప్రజలు వచ్చి గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు. మరో రెండు రోజుల్లో ఇంకొన్ని కోట్ల మంది రాబోతుండగా.. పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియా వేదికగా కుంభమేళాపై తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయం గుర్తించి పోలీసులు మొత్తంగా 140 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు పెట్టారు. అందులో 13 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. కుంభమేళాకు సంబంధించి అనేక మంది తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా డబ్బులు సంపాదించుకోవడానికి తమకు నచ్చిన వార్తలను రాస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఓ వ్యక్తి ఫిబ్రవరి 14వ తేదీన కుంభమేళాకు వెళ్తున్న రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తను సృష్టించాడు. 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ రైలు ప్రమాద వీడియోను దీనికి జోడిస్తూ.. ఇప్పుడే జరిగినట్లు వివరించాడు. ఈ ఒక్కటి మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఇలాంటి అనేక తప్పుడు వార్తలు ఉన్నాయి. అయితే వీటిని గుర్తించిన ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే తప్పుడు వార్తలు క్రియేట్ చేసిన మొత్తం 140 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించారు. వెంటనే వాటన్నిటిపై కేసులు కూడా పెట్టారు. అంతేకాకుండా ఇందులో 13 మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని నేరుగా కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ వెల్లడించారు. అలాగే తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇన్‌ఫ్లూయెన్సర్లను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఇది మాత్రమే కాకుండా ప్రజలెవరూ తప్పుడు వార్తలను నమ్మొద్దని.. ముఖ్యంగా వాట్సాప్, ఫెస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో వైరల్ అయ్యే వాటిని పట్టించుకోవద్దని వివరించారు. మరో రెండు రోజుల్లోనే ముగియబోతున్న కుంభమేళాకు ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని.. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎక్కువ మంది వస్తారని తెలిపారు. అందుకోసం తాము అనేక చర్యలు చేపట్టినట్లు కూడా చెప్పారు. ఈక్రమంలోనే ప్రయాగ్‌రాజ్‌లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎంత మంది యాత్రికులు వచ్చినా ఎలాంటి సమస్య లేకుండా.. హాయిగా పుణ్య స్నానాలు చేసే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రితో ముగియబోతుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. 41 రోజుల్లోనే ఈ రికార్డు బ్రేక్ కాగా.. కుంభమేళా ముగిసే సరికి మరెంత మంది భక్తులు హాజరు అవుతారో చూడాలి.