రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపట్టబోతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. అలాగే, కొత్తగా సబ్‌ డివిజన్లు, సర్కిల్‌ ఆఫీసులు, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌స్టేషన్లూ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తోన్న సర్కారు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు విభాగంలోనూ అవసరమైన మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసింది. ఈ రెండు విభాగాలకూ అత్యాధునిక సాంకేతిక, మౌలిక సౌకర్యాలను సమకూర్చింది. అయినప్పటికీ రాష్ట్రంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది నేరాలు స్వల్పంగా పెరిగడం గమనార్హం. స్వల్ప వివాదాలు కూడా హత్యాయత్నాలు, హత్యలకు.. చిన్నచిన్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇటీవల లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళన ఏకంగా జిల్లా కలెక్టర్‌పై దాడికి దారితీయడం, కామారెడ్డి, ఆదిలాబాద్‌లలో మొదలైన చిన్న వివాదం ఘర్షణలకు కారణమవడం వంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే పోలీసులు అక్కడకు చేరుకోగలిగితే వాటిని అదుపు చేయడానికి, ఉద్రిక్తతలను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది జరగాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు పోలీసులు మరింతగా అందుబాటులో ఉండాలనే అభిప్రాయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుకు సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆలోచనల మేరకు పోలీసుశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.అలాగే, శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళా, సైబర్‌ సహా ప్రస్తుతం రాష్ట్రంలో 844 పోలీస్‌ స్టేషన్లు ఉండగా, కొత్తగా మరో వందకుపైగా ఏర్పాటు కాబోతున్నాయని తెలుస్తోంది. అధికార వర్గాల ప్రకారం ‘కొత్తగా ఏర్పాటుచేయబోయే పోలీస్ స్టేషన్‌లలో ట్రాఫిక్, మహిళా స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టైర్-2 పట్టణాల్లోనూ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే దాదాపు 40 ట్రాఫిక్, అదనంగా 20 వరకూ మహిళా ఠాణాలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.. ప్రస్తుతం ఉన్న వాటిలో సుమారు 150 పోలీస్ స్టేషన్ల స్థాయిని పెంచబోతున్నారు.. దాంతో ఆయా పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది సంఖ్య పెరగడమే కాదు వసతులు మెరుగవుతాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇప్పటికే చేరాయి.. త్వరలోనే వీటికి ఆమోదం లభిస్తుంది’ అని తెలిపాయి. కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటైతే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.