తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఎల్‌ఆర్ఎస్‌పై నేడు ప్రభుత్వ మార్గదర్శకాలు..!

Wait 5 sec.

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (Layout Regularisation Scheme)పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు మరో ఛాన్స్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే.. ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS) ఫీజులోనూ 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో రాయితీ వర్తించనున్నట్టు తెలిపింది. అయితే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా సర్కారు పక్కా ప్రణాళికను రూపొందించింది.ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు, జల వనరుల పరిధిలో ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి.. మిగిలి అన్ని దరఖాస్తులను ఆటోమెటిక్‌గా ఫీజు జనరేట్ చేసే సిస్టమ్‌ను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో ఇప్పటికే కొన్ని సవరణలు చేస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయగా.. ఇవాళ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. అదేవిధంగా దరఖాస్తులకు సంబంధించి రుసుము సమాచారాన్ని కూడా వెల్లడించనుంది ప్రభుత్వం. ఇక ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో ఇతర శాఖ అధికారుల విచారణకు ప్రమేయం లేకుండా, సర్కార్ భూములను ఆనుకొని లేని సర్వే నంబర్లలో వేసిన లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకోని వారికి కూడా.. లేఅవుట్‌లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్‍కు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా ఎల్ఆర్ఎస్‌కు అవకాశం ఇస్తున్నారు. వీరికి కూడా 25 శాతం రాయితీ కల్పించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రులు సూచించారు.ఇదిలా ఉంటే.. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుమారుగా 25.67 లక్షల దరఖాస్తులు అందినట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.