మహాశివరాత్రికి శైవక్షేత్రాలకు వెళ్తున్నారా.. 4 రోజులు భారీగా స్పెషల్ బస్సులు.. ఈ రూట్లలోనే..!

Wait 5 sec.

ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున శైవక్షేత్రాలను దర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ప్రముఖ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం.. భారీగా స్పెషల్ బస్సులను నడిపించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఏకంగా 440 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడతో పాటు పలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు సజ్జనార్ ప్రకటించారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా.. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నాలుగు రోజులపాటు స్పెషల్ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సు సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులను సజ్జనార్ కోరారు.సికింద్రాబాద్ నుంచి కీసరగుట్టకు 90 బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించగా.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు నుంచి 100 బస్సులు ఉండనున్నట్టు తెలిపారు. ఇక.. అమ్ముగూడ నుంచి కీసరకు 70 స్పెషల్ బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు కీసరకు నుంచి 25 బస్సులు రాకపోకలు సాగించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్టకు మొత్తం 285 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని సజ్జనార్ వెల్లడించారు.ఇక.. సీబీఎస్ బస్ట్ స్టేషన్ నుంచి.. మెదక్‌లోని ఏడుపాయలకు 125 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్టు సజ్జనార్ ప్రకటించారు. అంతేకాకుండా పటాన్ చెరు నుంచి బీరంగూడకు 30 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. మొత్తం అన్ని రూట్లలో కలిపి.. 440 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు ఏమైనా సందేహాలు ఉంటే 9959226160 (కోఠి), 9959226154 (రేతిఫైల్ బస్ స్టేషన్) నెంబర్లను సంప్రదించాలని సూచించారు.ఇదిలా ఉంటే.. దక్షణకాశిగా పెరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి ఏకంగా 778 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు.. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఉపయోగించుకుని వేములవాడకు సురక్షితంగా చేరుకుని.. ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.