తెలంగాణలో తీసుకుంది. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో అభివృద్ధి చేయాలని గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో చాలా రోడ్లు దుర్భర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, నాణ్యతతో కూడిన, దీర్ఘకాలం మన్నే రోడ్లను నిర్మించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు, నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ కింద 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ కింద 7,947 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నారు. ఈ రోడ్లను రెండున్నరేళ్లలో పూర్తి చేసి 15 ఏళ్ల పాటు ఒకే ఏజెన్సీ నిర్వహణ చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. హామ్ విధానంలో ఈ రోడ్లను డీబీఎం (డెన్స్ బిటుమినస్ మకాడమ్) లేదా బీఎం (బిటుమినస్ మకాడమ్) పొరతో నిర్మించనున్నారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం, బిటుమినస్ కాంక్రీట్ (BC) పొరకి, దాని కింద ఉన్న వాటర్ బౌండ్ మకాడమ్ (WMM) పొరకి మధ్యలో డీబీఎం/బీఎం పొర తప్పనిసరిగా ఉండాలి. జాతీయ రహదారులను ఈ పద్ధతిలోనే నిర్మిస్తారు. ఈ పొరను వేయడం వల్ల రోడ్డు గట్టిగా ఉండటమే కాకుండా, ఎక్కువ కాలం మన్నుతుంది మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది. డీబీఎం/బీఎం పొర లేకపోతే భారీ బరువులను రహదారులు తట్టుకోలేక త్వరగా పాడైపోతాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ఆర్ అండ్ బీ రోడ్లను డీబీఎం పద్ధతిలో నిర్మిస్తారు. పంచాయతీరాజ్ రోడ్లను బీఎం పద్ధతిలో నిర్మిస్తారు. ఈ విధంగా నాణ్యతతో కూడిన నిర్మాణంతో రోడ్లు దీర్ఘకాలం మన్నుతాయని అంచనా వేస్తున్నారు. హామ్ రోడ్ల కోసం ప్రతి 200 మీటర్ల వ్యవధిలో డేటా సేకరించారు. మొత్తం 65 వేల డేటా పాయింట్లు, 2,568 వీడియోలను రూపొందించారు. మొదటి దశలో గనులు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలాలకు వెళ్లే 2,254 రోడ్లను (మొత్తం 7,947 కి.మీ.) గుర్తించారు. ఈ రోడ్లు 2,678 గ్రామ పంచాయతీలను కలుపుతాయి.అర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లను ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా 9 ప్యాకేజీలుగా విభజించారు.హామ్ రోడ్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం 2043-44 సంవత్సరం వరకు గుత్తేదారు సంస్థకు కిస్తీల వారీగా చెల్లించనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు తెలంగాణలోని రోడ్ల మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.