లక్కీ భాస్కర్‌ సినిమా రిపీట్.. బ్యాంకులోని రూ.4.58 కోట్లు కాజేసిన మేనేజర్, చివరికి ఏమైందంటే?

Wait 5 sec.

కొన్ని నెలల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్.. ఒక బ్యాంకులో పనిచేస్తాడు. అయితే బ్యాంకులో ఉండే డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుని.. భారీగా సంపాదిస్తాడు. బ్యాంకు డబ్బులను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు ఆర్జిస్తాడు. చివరికి ఆ స్కామ్ బయటపడే లోపు.. డబ్బులన్నీ తీసుకుని విదేశాలకు వెళ్లిపోయి సెటిల్ అవుతాడు. ఇక అదే బ్యాంకులో హీరో లాగే స్కామ్ చేసిన ఉన్నతాధికారులు పోలీసులకు దొరికిపోతారు. అయితే అచ్చం అలాంటి సంఘటనే తాజాగా రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. కోటాలో ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేసిన సాక్షి గుప్తా అనే మహిళ.. ఏకంగా 41 మంది ఖాతాదారులకు చెందిన 110 ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల నుంచి రూ.4.58 కోట్లను విత్ డ్రా చేసుకుంది.ఈ రూ.4.58 కోట్లను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి.. వాటి నుంచి భారీగా లాభాలు పొంది.. తర్వాత మళ్లీ ఆ డబ్బులను బ్యాంకులో జమ చేయాలని భావించింది. కానీ సాక్షి గుప్తా పెట్టుబడి పెట్టిన స్టాక్‌లు భారీగా పడిపోవడంతో.. తీవ్ర నష్టాలను చవిచూసింది. దీంతో బ్యాంకు నుంచి తీసుకున్న రూ.4.58 కోట్లను తిరిగి జమ చేయలేకపోయింది. ఇక ఈ స్కామ్ బయటికి రావడంతో.. సాక్షి గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 నుంచి 2023 మధ్య సాక్షి గుప్తా ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ 3 ఏళ్లలో ఇంత జరుగుతున్నా బ్యాంకులో ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. విచారణలో పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. ఖాతాదారుల మొబైల్ నంబర్లను మార్చి.. ఓటీపీలను తన నంబర్‌కు వచ్చేలా చేసి ఆమె ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. యూజర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లింక్‌ను దుర్వినియోగం చేసిన సాక్షి గుప్తా.. 41 మంది ఖాతాదారులకు సంబంధించిన 110 అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని అక్రమంగా విత్ డ్రా చేసినట్లు తేలింది. అయితే ఆ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఒక వ్యక్తి తన ఎఫ్‌డీ అకౌంట్ గురించి విచారణ చేయడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు ఈ కుంభకోణం వెలుగు చూసింది. దీంతో బ్యాంకు అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఖాతాదారుల మొబైల్ నంబర్లను మార్చేసి.. ఆ స్థానంలో తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఆ ఎఫ్‌డీ అకౌంట్లకు సాక్షి గుప్తా లింక్ చేసింది. అంతేకాకుండా అకౌంట్ హోల్డర్‌లకు ఈ మోసం గురించి తెలియకుండా ఉండేందుకు ఓటీపీలు తన సిస్టమ్‌కు వచ్చేలా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో సాక్షి గుప్తా నిందితురాలు అని తేల్చిన పోలీసులు.. ఆమె తన సోదరి వివాహంలో ఉన్నపుడే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.ఇక ఈ ఘటనపై ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని.. ఈ మోసానికి పాల్పడిన సాక్షి గుప్తాను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. తమకు తమ ఖాతాదారుల ప్రయోజనం చాలా ముఖ్యమని పేర్కొన్న బ్యాంకు.. ఈ స్కామ్ వెలుగులోకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇలాంటి మోసాలను తాము తీవ్రంగా పరిగణిస్తామని.. ఖాతాదారులకు జరిగిన నష్టాన్ని బ్యాంకు భర్తీ చేస్తుందని స్పష్టం చేసింది.