ఆ పన్ను శ్లాబ్ తొలగింపు.. తగ్గనున్న ధరలు.. కేంద్రం వద్ద కీలక ప్రతిపాదన!

Wait 5 sec.

GST Council: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాలుగు పన్ను శ్లాబులు అమలులో ఉన్నాయి. ఇందులో ఒక పన్ను శ్లాబును పూర్తిగా తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు ప్రధాన పన్ను శ్లాబుల్ల ఒకటైన 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించే ప్రతిపాదనపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెలలో జరగనున్న వస్తు సేవల పన్ను ( జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారని ప్రధాన మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆ పన్ను శ్లాబులో ఉన్న వస్తువుల ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. ధరలు తగ్గించేలా నిర్ణయం ఉండవచ్చని వార్తాల కథనాల ద్వారా తెలుస్తోంది. 12 శాతం మధ్యస్థ రేటుగా ఉంది. అయితే, ఈ పన్ను శ్లాబును పూర్తి రద్దు చేసి అందులోని వస్తువులను 5 శాతం లేదా 18 శాతం శ్లాబుల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పు వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళతరం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 12 శాతం శ్లాబులోని వస్తువులను 5 శాతంలోకి మార్చితే వాటి ధరలు ఒక్కసారిగా తగ్గుతాయి. అయితే, 18 శాతానికి మార్చితే మాత్రం ధరలు భారీగా పెరుగుతాయి. కానీ, వస్తువుల, సేవల రకాన్ని బట్టి వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు 5 శాతంలోకి వచ్చేవే ఉన్నట్లు సమాచారం. అయితే, ఆదాయంపై ప్రభావం పడతుందనే ఆందోళనల నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్పులు ఏం చేయలేదు. కానీ ఈ సారి ప్రతిపాదిత మార్పులు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని వస్తువులపై పన్ను తగ్గే అవకాశం ఉండగా, మరికొన్ని వస్తువులపై ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు, వ్యాపార వర్గాలకు దీని ప్రభావం ద్విదిశగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.జీఎస్‌టీ కౌన్సిల్‌లో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిర్ణయాలు తీసుకుంటాయి. అందువల్ల ఈ ప్రతిపాదన అమలవ్వాలంటే సమగ్ర అంగీకారం అవసరం అవుతుంది. వచ్చే జులై నెలలో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చే అవకాశముంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే సమావేశానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరవుతారు.