విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. ఇప్పటికే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈరోజు మొదటి అరెస్టు కూడా చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య ఆదేశాల మేరకు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ను ఇవాళ బెంగళూరులో అరెస్టు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను బెంగళూరు విమానాశ్రయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ నిర్వహించిన డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెటవర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారందర్నీ కబ్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ అందుకున్న ఆర్సీబీ.. జూన్ 4న బెంగళూరులో భారీ పరేడ్ నిర్వహించింది. పరేడ్ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఈ సంబరాల్లో పాల్గొనడానికి బెంగళూరులోని లక్షలాది మంది అభిమానులు వద్దకు చేరుకోగా.. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా.. 56 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. దాంతో ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గిరీష్, ఆ జోన్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఏసీపీ బాలకృష్ణ, సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ శేఖర్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్‌ను సస్పెండ్ చేశారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. కర్ణాటక ప్రభుత్వం రూ. పది లక్షలు ప్రకటించగా, ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కూడా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని పేర్కొన్నారు.