రైతులు నిరంతరం ఉంటారు. వాతావరణ అనిశ్చితులు, పెట్టుబడి భారం ఒకవైపు ఉంటే.. దళారుల మోసాలు మరోవైపు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పంట వేసిన దగ్గర నుండి అమ్ముకునే వరకు అనేక సందర్భాల్లో దళారులు రైతుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. వారిని నిలువునా మోసం చేస్తూనే ఉంటారు. ఇలా రైతులను మోసం చేస్తున్న దళారులను చెక్ పెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి.. రైతుల వేషంలో వెళ్లి 34 మంది దళారులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో కొందరు దళారులు రైతుల అమాయకత్వాన్ని, ఆర్థిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా మోసం చేస్తున్నారు. బ్యాంకుల్లో అన్నదాతలకు ఉన్న అప్పులను చెల్లించి, కొత్త రుణాలు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అక్రమంగా దండుకుంటున్నారు. ఏటా బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీతో పంట రుణాలు అందజేస్తుంటాయి. ఒకవేళ ఏడాదిలోపు అప్పును తిరిగి చెల్లిస్తే వడ్డీలో 3 శాతం బోనస్ లభిస్తుంది. అంతేకాకుండా 20- 30 శాతం రుణాన్ని పెంచి కొత్త అప్పులు కూడా ఇస్తాయి. ఈ ప్రక్రియను తమ లబ్ధికి వాడుకుంటూ.. దళారులు రైతుల పాత అప్పులను చెల్లించి కొత్త రుణం ఇప్పించి ఆపై వారి నుంచి వేలాది రూపాయలు కాజేస్తున్నారు. ఈ సమస్యపై ఎస్పీ అఖిల్ మహాజన్‌కు సమాచారం అందడంతో ఆయన తక్షణమే స్పందించారు. బుధవారం పోలీసులు 16 బృందాలుగా విడిపోయి తొమ్మిది మండలాల్లో రైతుల వేషధారణలో రంగంలోకి దిగారు. రైతులుగానే భ్రమించిన దళారులు పోలీసులతో నేరుగా బేరసారాలకు దిగారు. ఈ సమయంలో పోలీసులు దళారుల మోసపూరిత వ్యవహారాలను పసిగట్టి, తగిన ఆధారాలు సేకరించారు. ఆధారాలు పక్కాగా సేకరించి గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో 34 మంది దళారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా రైతులు పోలీసుల పనిని మెచ్చుకుంటున్నారు. దళారులను అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల కృషిని అభినందిస్తున్నారు.