హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రోది కీలకపాత్ర. ఆర్టీసీ తర్వాత ప్రస్తుతం మూడు కారిడార్లలో విస్తరించి ప్రజలకు సేవలను అందిస్తోంది. మియాపూర్ - ఎల్బీ నగర్ (సుమారు 29 కి.మీ.), జూబ్లీ బస్ స్టేషన్ - మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (సుమారు 11.2 కి.మీ.), నాగోల్ - రాయదుర్గం (సుమారు 29 కి.మీ.) ఈ మూడు కారిడార్లలో కలిపి మొత్తం 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం అందుబాటులో ఉంది. అయితే కూడా జరుగుతున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.తాజాగా.. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురవారం భేటీ అయిన మంత్రివర్గం మొత్తం రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కిలోమీటర్ల మేర మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించింది.కారిడార్-1 పొడిగింపులో భాగంగా.. ఎయిర్‌పోర్టు (శంషాబాద్) నుంచి ఫ్యూచర్ సిటీ (మణికొండ/ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో) వరకు 39.6 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పారు. కారిడార్-2 పొడిగింపులో భాగంగా.. జూబ్లీ బస్‌స్టేషన్ (JBS) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరిస్తుంది, ముఖ్యంగా మేడ్చల్, కొంపల్లి వంటి ప్రాంతాల వారికి ప్రయాణం సులభతరం చేస్తుందన్నారు. కారిడార్-3 పొడిగింపులో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్ (JBS) నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఈ మార్గం జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట వరకు ఉత్తర తూర్పు భాగాలను కలుపుతుంది. 86.1 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మూడు కారిడార్ల విస్తరణకు రూ. 19,579 కోట్లు అవసరమవుతాయని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భాగస్వామ్యం వహించేలా నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ విస్తరణతో హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ మరింత పటిష్టమై, నగరం చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, నగర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నారు.