ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్‌తో పాటుగా చెన్నై నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ వే రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలతో సర్వే, భూసేకరణ పనులు మొదలయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ కూడా చేస్తున్నారు. కేంద్రం చెన్నై-మైసూరు మధ్య బుల్లెట్ రైలు 463 కి.మీ దూరం ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా వెళ్తుంది. ఈ రైలు మార్గంలో మొత్తం తొమ్మిది స్టాపింగ్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. అందులో పలమనేరు మండలంలోని 190-రామాపురం దగ్గర ఒక స్టాపింగ్ ఉంటుందని చెబుతున్నారు.ఈ మేరకు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి NHSRCL జీఎం నిషాంత్ సింఘాల్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అధికారులు 41 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. దాదాపు 876 మంది రైతుల నుండి భూమిని సేకరించే పనిలో ఉన్నారు. దీని కోసం ఇప్పటికే సర్వే చేసి ఆయా భూముల్లో రాళ్లు కూడా పాతుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జల్లిపేట, కూర్మాయి, మొరం, కొలమాసనపల్లె, పలమనేరు, పెంగరగుంట, సముద్రపల్లె వంటి ఊర్లలో భూసేకరణ చేస్తున్నారు. బైరెడ్డిపల్లె మండలంలో కంభంపల్లె, శెట్టిపల్లె, బేలుపల్లె, ఆళ్లపల్లె, లక్కనపల్లె ఊర్లలోకూడా భూసేకరణ, లైన్ అలైన్‌మెంట్ పనులు చేపట్టారు. ఈ మేరకు ప్రాజెక్ట్ కోసం సర్వే, భూసేకరణ మొదలుపెట్టారని చెబుతున్నారు అధికారులు.