థియేటర్ల బంద్, పర్సంటేజీ సిస్టమ్ పై పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సింగిల్ స్క్రీన్స్ సమస్య ఉందని, పర్సంటేజీ వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం తన 'హరి హర వీరమల్లు' సినిమాపై కుట్ర చేస్తున్నారని తెర మీదకు రావడం సరికాదని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పలు కామెంట్స్ చేసారు. వీటిపై నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికి పోయారంటూ నారాయణ మూర్తిపై షాకింగ్ కామెంట్స్ చేసారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. ''గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నరక యాతన చూపించారు. సర్వనాశనం చేసారు. 'భీమ్లా నాయక్' సినిమా అప్పుడు 125 థియేటర్లు సీజ్ చేసినప్పుడు నారాయణమూర్తి ఎక్కడ ఉన్నారో గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. ఆరోజు పోసాని కృష్ణమురళి ఎక్కడ ఉన్నాడు? ఇండస్ట్రీని ఎందుకు శాసిస్తున్నారు? ఎందుకు వేధిస్తున్నారు? అని ఆరోజు జగన్ మోహన్ రెడ్డిని నారాయణమూర్తి ఎందుకు ప్రశ్నించలేదు? పవన్ కళ్యాణ్ సినిమా ప్రదర్శించకపోతే థియేటర్లకు క్లియరెన్స్ ఇస్తామని బెదిరించారు. ఆరోజు మీరు ఖండించి ఉంటే బాగుండేది. ఏదో ప్రెస్ మీట్ లో ప్రత్యేకంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్?'' అని ప్రశ్నించారు. ''నారాయణ మూర్తి తీసిన సినిమాలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు తేడా కనిపిస్తోంది. గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి, సామాన్యులకు రేట్లు అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం తప్పా?. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? జగన్ మోహన్ రెడ్డి చేసిన న్యాయం ఏంటి? పేదల కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ పై మాట్లాడతారు కానీ, జగన్ చేసిన అరాచకాలపై మాత్రం మాట్లాడరు. రూ.300 కూల్ డ్రింక్, రూ.500 రూపాయల టికెట్ రేటు ఉంటే మీరు మాట్లాడరు. నిజమైన ఎగ్జిబ్యూటర్లకు నష్టం జరుగుతుంటే మీరు మాట్లాడరు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఖండించాల్సిన అవసరం ఏముంది?''''థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారో మీకు తెలుసా? మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు చెప్పలేదా. ఆరోజు చిరంజీవితో సహా ఇతర సినీ పెద్దలను అవమానించినప్పుడు, అన్నం పెట్టకుండా అర్థ కిలో మీటర్ నడిపించినపుడు, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు, చిన్న సినిమాకి ఐదో షోకి అనుమతి ఇవ్వనప్పుడు ఆర్ నారాయణమూర్తి ఒక్కసారైనా ఖండించారా? ఆరోజు మీరు ఖండించి ఉంటే మీకు హ్యాట్సాఫ్ చెప్పేవాళ్లం. చిరంజీవిని అవమానించడం తప్పు అని ఆరోజు మేము మాట్లాడాం. ఐదో షో ఇవ్వలేదని ప్రశ్నించాం'' అని నట్టికుమార్ అన్నారు. ఈ క్రమంలో అమ్ముడుపోయావా? అంటూ ఆర్ నారాయణ మూర్తిపై షాకింగ్ కామెంట్స్ చేసారు. అయితే ఆర్ నారాయణ మూర్తిపై నట్టికుమార్ చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతుండగా.. న్యూట్రల్ నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా నీతి నిజాయితీగా బ్రతికే ఆర్ నారాయమూర్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అంటున్నారు. మిగతా సినీ ప్రముఖులకు భిన్నంగా నిడారంబరమైన జీవితం గడిపే ఆయన్ను నట్టికుమార్ అమ్ముడుపోవాయా అనడంపై విరుచుకుపడుతున్నారు. ఇండస్ట్రీ సమస్యలపైనా, చిన్న నిర్మాతలు ఎగ్జిబిటర్స్ తరపున ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ అంటూ నారాయణమూర్తి అభినందించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.