ట్యాక్స్ పేయర్లూ.. ఐటీ శాఖ కీలక ప్రకటన.. ITR-1, ITR-4 ఎక్సెల్ యుటిలిటీలు విడుదల!

Wait 5 sec.

ITR filing 2025: పరిధిలోకి వచ్చే వారు ప్రతి సంవత్సరం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ తొలి వారంలోనే ఐటీఆర్ ఫామ్స్, ఎక్సెల్ యుటిలిటీలను విడుదల చేస్తారు. కానీ, ఈసారి ఆలస్యమైంది. వారం క్రితమే ఐటీఆర్ ఫామ్స్ తీసుకొచ్చింది. ఆలస్యమైన క్రమంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT). ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి 2025- 26 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్- 1 (సహజ్), ఐటీఆర్- 4 (సుగమ్) ఎక్సెల్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తాజాగా వెల్లడించింది. ఐటీఆర్- 1, ఐటీఆర్- 4 ఎక్సెల్ యుటిలిటీలు విడుదల చేసిన క్రమంలో పన్ను చెల్లింపుదారులు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ విషయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం శుక్రవారం రోజే సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ' ట్యాక్స్ పేయర్లకు అలర్ట్. ట్యాక్స్ పేయర్లకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి.' అని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఐటీఆర్- 1, ఐటీఆర్- 4 ఫారాల్లో రూ. 50 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.ఈ ఏడాది నుంచే ఈ కొత్త మార్పులు చేశారు. ఇంతకు ముందు మూలధన లాభాలు ఉన్న వారు ఐటీఆర్- 2, ఐటీఆర్-3 ఫారం ఉపయోగించే వారు. పరిమితికి మించి ఆదాయం ఉన్న వ్యక్తులు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలి. టీడీఎస్ మినహాయింపు అవుతున్న ఉద్యోగులు, రూ.10 వేలకు మించి ఆదాయం ఉండి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారు ఫైల్ చేసి అదనంగా చెల్లించిన ట్యాక్సులను రీఫండ్ కోరవచ్చు. అయితే ఉద్యోగులు ఫారం 16 వచ్చిన తర్వాతే ఫైల్ చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.