గుడ్‌న్యూస్. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున జూన్ 1 నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు. తాజాగా.. లబ్ధిదారులకు అందించింది. రేషన్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు కూడా ఇచ్చేందుకు రేడీ అయింది. ఈ మేరకు సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు నల్గొండ ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో రైతులు మరింత లాభాలు పొందేందుకు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. త్వరలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలను ప్రారంభిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాకు లక్ష టన్నుల సామర్థ్యం గల గోదాములను మంజూరు చేస్తామని.. వాటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు.మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని తెలిపారు. మే 29, 2023 నాటికి యాసంగిలో కేవలం 47 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఈ ఏడాది మే 29 నాటికి 67 లక్షల టన్నులు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం నుంచి ధాన్యాన్ని శుభ్రపరిచే, ఆరబెట్టే యంత్రాలను కొనుగోలు కేంద్రాలకు కేటాయిస్తామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఎస్సారెస్పీలో పూడికతీత పనులను ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లోనూ త్వరలో పూడికతీత పనులు చేపడతామని హామీ ఇచ్చారు.జూన్ 2 తర్వాత నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధుల ప్రస్తావనతో పాటు, మ్యానిఫెస్టోలో ప్రకటించని అంశాలకు కూడా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ.1,700 కోట్ల మేర రహదారుల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు.