ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు అడుగులుపడుతున్నాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా దూపాడు-బేతంచెర్ల రైల్వే లైన్ కోసం భూమిని సేకరించాలని ఆదేశించారు. నీటి సరఫరా పనులు జూలైలోగా పూర్తి చేయాలన్నారు. రూ.1.61 కోట్ల విలువైన 24 క్లెయిమ్‌లకు పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఆమోదం తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఏపీఐఐసీ జెడ్‌ఎంను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతానికి నీటి సరఫరా పైపులైన్ పనులు జులై నాటికి పూర్తి చేయాలని.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ మేరకు పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 24 క్లెయిమ్‌లకు రూ.1.61 కోట్లకు ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు ప్రోత్సాహకాలకు సంబంధించి..పెట్టుబడి రాయితీ కింద 17 క్లెయిమ్స్‌కు రూ.1,57,50,166 మంజూరు చేశారు. వడ్డీ రాయితీ కింద ఒక క్లెయిమ్‌కు రూ.13,813, విద్యుత్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కింద రూ.36,663, సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్ కింద 5 క్లెయిమ్స్‌కు రూ.3,35,265 ఆమోదించినట్లు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలను జనరల్ కేటగిరీకి 7, ఎస్సీలకు 15, ఎస్టీలకు 2 చొప్పున మొత్తం 24 మందికి లబ్ధి చేకూరింది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని..పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి 2135 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. దూపాడు నుంచి ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టులన్నీ జిల్లాలో రైలు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఉపయోగంగా ఉంటాయంటున్నారు. కర్నూలు నుంచి మంత్రాలయానికి వేయాలని ప్రతిపాదన ఉంది. దీని గురించి గతంలో సర్వే కూడా చేశారు. ఈ మార్గం ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కర్నూలు నుంచి నంద్యాలకు ప్రతిరోజు వేలాది మంది వెళతారు. ప్రస్తుతం రైలులో వెళ్లాలంటే కర్నూలు నుంచి దూపాడు, వెల్దుర్తి, డోన్, బేతంచెర్ల, పాణ్యం మీదుగా వెళ్లాలి. అలా వెళ్లాలంటే 130 కిలోమీటర్లు దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది. అదే బస్సులో అయితే కనుక 83 కి.మీ.. ఈ క్రమంలో ఎక్కువమంది బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ కర్నూలు నుంచి మంత్రాలయం రైలులో కనుక వెళ్లాలంటే గద్వాల వెళ్లి అక్కడి నుంచి రాయచూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే కర్నూలు నుంచి మంత్రాలయం వరకు కొత్త రైలు మార్గం తెరపైకి వచ్చింది. కొత్త రైలు మార్గం వస్తే వారందరికీ తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంద అంటున్నారు.