తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఉచితంగానే, టీటీడీ కీలక నిర్ణయం

Wait 5 sec.

సనాతన ధర్మాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు టీటీడీ ఈవో జే శ్యామల రావు. ప్రత్యేక యూట్యూబ్ ఛానల్‌లో ఒకే చోట అన్నమయ్య సంకీర్తనలు ఉండాలన్నారు. ఈవో తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్‌లోని సమావేశ మందిరంలో హెచ్‌డీ పీపీ, శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎపిక్ స్టడీస్, తదితర ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు. 'సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.. భగవద్గీత సారాంశాన్ని పిల్లలు, యువతకు అర్థవంతంగా, సరళంగా ఉండేలా అందించేందుకు చర్యలు చేపట్టాలి. భగవద్గీతలోని ముఖ్యమైన ఘట్టాలను సరళతరంగా, సులంభగా ఉండేలా కార్టూన్, వీడియోల రూపంలో అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. హిందూ ధర్మం విశిష్టత, ధార్మిక, ఆధ్యాత్మిక,మానవీయత, నైతిక విలువల గురించి యువతకు తెలియజెప్పేలా కార్యక్రమాలు రూపొందించాలి. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా ధార్మిక కార్యక్రమాలను తయారు చేయాలి. విద్యార్థులలో దైవభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబవ్యవస్థ తదితర అంశాలపై యువతకు శిక్షణ ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి' అన్నారు. 'భజన మందిరాలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి అయ్యాయి, చివరి దశలో ఎన్ని ఉన్నాయో సమగ్ర నివేదిక అందించాలి. హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ద్వారా ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని మరింత నాణ్యంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా ఇప్పటి నుంచే సంబంధిత ప్రతినిధులతో మాట్లాడాలి. పచ్చదనాన్ని మరింత పెంచేలా శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరిగి వెళ్లే భక్తుల ద్వారా గ్రీనరీని ప్రోత్సహించే విధంగా ‘శ్రీవారి వన నిధి’ ద్వారా ఒక మొక్కను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి' అని తెలిపారు. ఈవో శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పనితీరును సమీక్షించారు. 'టీటీడీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక యూట్యూబ్ ఛానల్‌లో ఉచితంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలను అన్నింటినీ ఒకే చోట ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య సంకీర్తనలలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాటిని ముందుగా పొందు పరిచి, దశల వారీగా అన్ని సంకీర్తనలను అందులో పొందుపరచాలి. కొత్త సంకీర్తనలు బాగా పాపులర్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. అన్నమయ్య 32 వేల సంకీర్తనలలో 14, 932 సంకీర్తలు లభ్యమయ్యాయి. అందులో ఇప్పటి వరకు ఎన్ని సంకీర్తనలను రికార్డు చేశారు, ఇంకా ఎన్ని రికార్డు చేయాల్సి ఉంది. అన్నమయ్య కీర్తనల ప్రత్యేక వెబ్ పేజీలో ఎన్ని సంకీర్తనలు అప్ లోడ్ చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో సమగ్ర నివేదిక అందించాలి' అన్నారు. పబ్లికేషన్ శాఖ పనితీరుపై ఈవో సమీక్ష చేశారు. 'టీటీడీ ముద్రించిన అన్ని పుస్తకాలు టిటిడి బుక్ స్టాల్స్ లో లభ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. పిల్లలకు, యువతకు అర్థవంతంగా, సులభతరంగా ఉండేలా కథనాలు రాసి ముద్రించాలి. ఇప్పటి వరకు టీటీడీ ఎన్ని పుస్తకాలను ముద్రించింది, టీటీడీ ఈ బుక్స్ లో ఎన్నింటిని అప్ లోడ్ చేశారో వివరాలపై నివేదిక ఇవ్వాలి.. విశేష ఆదరణ పొందిన పుస్తకాలను ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి' అని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.