చాలా కాలం తర్వాత గ్రౌండ్‌లో యాక్టివ్‌గా కనిపించాడు. ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తూనే ఉంటాడు.. కానీ ఈ సారి కెప్టెన్ అవతారమెత్తాడు. రజత్ పటిదార్ గ్రౌండ్‌లో ఉన్నప్పటికీ తానే నేరుగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో పాటు బౌలర్లకు సలహాలు కూడా ఇచ్చాడు. తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో కోహ్లి సగం కెప్టెన్సీ చేసి లీడర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన సత్తా చాటుతోంది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ని చిత్తు చిత్తు చేసి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 18వ సీజన్‌ కావడం, జెర్సీ నెంబర్ 18 కావడంతో ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ సాధించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. అదే స్పిరిట్‌తో సీజన్ ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు ఫైనల్స్‌లో రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ముల్లాన్‌పూర్ వేదికగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పాత్ర చాలా కీలకంగా మారింది. స్లిప్‌తో పాటు మిడిల్‌లో ఉన్న విరాట్ కోహ్లి గ్రౌండ్‌లోని ప్లేయర్లందర్నీ అలర్ట్ చేస్తూనే ఉన్నాడు. పంజాబ్ వికెట్లు కోల్పోతున్న సమయంలో మరింత అలర్ట్‌గా ఉన్న కోహ్లి బౌలర్లకు వికెట్లు ఎలా పడగొట్టాలో సలహా ఇచ్చాడు. ముఖ్యంగా సుయాశ్ శర్మని ఎంకరేజ్ చేస్తూ పంజాబ్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. సుయాశ్ లైన్ తప్పిన ప్రతిసారీ దగ్గరకు వచ్చి మరీ టెన్షన్ తీసుకోకుండా బౌలింగ్ చేయంటూ చెప్పాడు. పంజాబ్ బ్యాటర్లకు టైమ్ ఇవ్వకుండా వెంటవెంటనే అవుట్ చేయించడంలో విరాట్ కోహ్లి పాత్ర చాలా కీలకమనే చెప్పొచ్చు. విరాట్ కోహ్లి 18 ఏళ్ల కలకు మరొక్క అడుగు దూరంలోనే ఉన్నాడు.కేవలం ఫీల్డింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ ఈ సీజన్‌లో కోహ్లి రాణించాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి మోస్ట్ రన్స్ జాబితాలో టాప్ 5 లిస్ట్‌లో నిలిచాడు. 73 బెస్ట్‌తో ఎనిమిది హాఫ్ సెంచరీలు చేయడమే కాకుండా ఏకంగా 614 పరుగులు చేశాడు. గతేడాది 15 మ్యాచ్‌లలో 714 పరుగులు చేసిన కోహ్లి ఇప్పుడు 614 పరుగులతో ఉన్నాడు. ఇక ఫైనల్‌లో విరాట్ కోహ్లి తనదైన ఆటతీరుతో ఆకట్టుకోవడం ఖాయమనే చెప్పొచ్చు.