భారత్‌ దెబ్బకు ఎడారిలా మారుతున్న పాక్.. సింధు నీటిని నిలిపేయడంతో వాటర్ ఎమర్జెన్సీ

Wait 5 sec.

తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఉగ్రవాద స్థావరాలకు అడ్డాగా మారిన పాకిస్తాన్.. అంతకంతకూ అనుభవిస్తోంది. ఇక ఈ ఉగ్రవాదాన్ని భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాక్.. అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లే సింధు నదీ జలాలను నిలిపివేసింది. ఇది పాకిస్తాన్‌లోని ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలోని కీలక జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. ఇది పాకిస్తాన్‌ను ఎడారి చేసేలా కనిపిస్తోంది. సింధు పరివాహక ప్రాంతంలో 15 శాతం నీటి ప్రవాహం తగ్గడంతో.. ఇప్పటికే ఈ వేసవిలో పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో పడిన పాక్ రైతులకు.. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజా లెక్కల ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న టార్బెలా ఆనకట్ట వద్ద సింధూ నది నీటి మట్టం 1,465 మీటర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ టార్బెలా కనిష్ఠ స్థాయి నీటిమట్టం 1,402 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టంతో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుందని సమాచారం. అటు పంజాబ్ ప్రావిన్స్‌లోనూ నీటి విడుదల గణనీయంగా తగ్గిపోవడంతో తీవ్ర నీటి కటకట ఏర్పడింది. గతేడాది జూన్ 5వ తేదీన 1.44 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా.. ప్రస్తుతం అది 1.24 లక్షల క్యూసెక్కులకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.పంజాబ్‌లోని చస్మా డ్యామ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 644 మీటర్లు ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఈ చస్మా డ్యామ్ డెడ్‌ స్టోరేజీ 638 మీటర్లని పేర్కొన్నారు. మరోవైపు.. సియాల్‌కోట్‌లో మరాలా వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ చీనాబ్‌ నదిపైపై సగటు నీటి విడుదల మే 28వ తేదీన 26,645 క్యూసెక్కులు ఉండగా.. జూన్ 5వ తేదీ నాటికి అది కేవలం 3,064 క్యూసెక్కులకు పడిపోవడం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ తీవ్ర నీటి ఎద్దడితో పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఖరీఫ్ పంటలు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి నీటిని నిలిపివేస్తూ.. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌కు 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే ఆ దేశం అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా మారే వరకు సింధూ జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.