అది స్వతంత్రత సేనాని ఎక్స్‌ప్రెస్ రైలు.. వేగంగా పరుగులు తీస్తోంది. ఇంతలో ఓ రైల్వేస్టేషన్ వచ్చింది. చక్కగా టక్ చేసుకున్న ఓ వ్యక్తి రైలులోకి ఎక్కారు. నేరుగా ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లోకి వెళ్లారు. దర్జాగా అక్కడ బెడ్ మీద పడుకున్నారు. ఇంతలోపే టీటీఈ వచ్చారు. తన పేరు అలోక్ కుమార్ ఝా‌ అంటూ టీటీఈకి పరిచయం చేసుకున్నారు ఆ వ్యక్తి. తాను అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్‌నని చెప్పారు. దీంతో టీటీఈ గుండెలు జారిపోయాయి. అంత పెద్ద అధికారి ఎందుకు వచ్చారా అంటూ భయపడిపోయారు. స్వామి సేవ చేయటం మొదలుపెట్టారు. ఇక అది మొదలు.. టీ, బిస్కట్ ఇలా ఆ బోగీలోకి క్యూ కట్టాయి. అయ్యవారు ఆదేశించడం .. టీటీఈ తీసుకెళ్లి ఇవ్వటం.. మహారాజు గారి దర్జా ఓ రేంజులో సాగిపోయింది..అయితే ఇంతలోపే ఊహించని ఘటన జరిగింది. సమస్తిపూర్ కంట్రోల్ రూమ్ నుంచి జీఆర్పీ వారికి ఓ రహస్య సమాచారం అందింది. దీంతో కథ మొత్తం మారిపోయింది. స్వతంత్రతా ఎక్స్‌‍ప్రెస్ రైలు దర్భంగా రైల్వేస్టేషన్ చేరుకుంది. ఇంతలోపే పోలీసులు, సీటీటీఐ సిబ్బంది హడావిడిగా రైలు వద్దకు చేరుకున్నారు. రైలులో తనిఖీలు మొదలుపెట్టారు. మనోడి వద్దకు రాగానే.. వివరాలు చెప్పాలని ప్రశ్నించారు. యథావిధిగానే తన పేరు అలోక్ కుమార్ ఝా అని.. తాను అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ (ఏడీఆర్‌ఎమ్) నంటూ చెప్పాడు. దీంతో పోలీసులు కాస్త గద్దించి అడిగారు. తాను ఏడీఆర్ఎమ్ అల్లుడిని అని చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తన అసలు పేరు, అసలు రూపం బయటపెట్టేశాడు. తన పేరు దుర్గాకాంత్ చౌదరి అని.. తానో ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌నని అంగీకరించాడు. తనది మధుబని జిల్లాలోని నోహన్ బదియమ్ గ్రామమని అసలు నిజం కక్కేశాడు. దుర్గాకాంత్ చౌదరికి పెద్ద అధికారి కావాలని ఆశని.. వీఐపీ విలాసాలకు అలవాటు పడి ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు మనోడు రైళ్లో ప్రయాణించేందుకు టికెట్ కూడా కొనలేదని తేలింది. మరోవైపు దుర్గాకాంత్ చౌదరి తీరుపై కేసు నమోదైంది. దర్భంగా రైల్వే స్టేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే యాక్ట్ ప్రకారం దుర్గాకాంత్ చౌదరి మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. సమస్తిపూర్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఏసీ కోచ్‌లో రైల్వే ఏడీఆర్ఎమ్ అని చెప్తూ మనోడు చూపించిన దర్జా.. టీటీఈతో చేయించుకున్న సేవలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనం పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏడీఆర్ఎమ్ అని చెప్పగానే ఐడీ కార్డు కూడా చూడకుండా ఎలా నమ్మారంటూ కొంతమంది ప్రశ్నిస్తుండగా.. ఇలాంటి ఘటనలు కేవలం మన దేశంలోనే జరుగుతాయంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.