ఏపీలో వేస్ట్‌గా పడేసే ఈ గింజలకు మంచి డిమాండ్.. ఏకంగా రూ.కోట్లలో వ్యాపారం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో చింత గింజలకు డిమాండ్ పెరిగింది.. ఏకంగా రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. దక్షిణాదిలో చింత గింజల వ్యాపారం చాలా పేరు పొందింది. ఈ చింత గింజలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. వీటిని అమ్మేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చింతపండు ధరలు పెరుగుతున్నాయి.. అందుకే చింత గింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ వ్యాపారం ఏటా కోట్ల రూపాయలు జరుగుతుంది.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ వ్యాపారం ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీసత్యసాయిజిల్లా హిందూపురంలో జరుగుతోంది. చింత గింజల పొడి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇతర దేశాల్లోని ఫార్మా కంపెనీలు, పట్టు వస్త్రాల తయారీ, రంగుల కంపెనీలు కూడా ఈ పొడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో కిలో చింత గింజలు ధర రూ.30-35 మధ్యలో ఉండేది.. కానీ ఈ ఏడాది కిలో చింత గింజలు రూ.40 నుంచి రూ.44 వరకు నడుస్తోంది. ఏపీకి పొరుగున ఉండే తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి చింత గింజలను పుంగనూరుకు తెప్పిస్తారు. అక్కడ వాటి పొట్టు తీసే ప్రక్రియ ఉంటుంది. పుంగనూరులోనే పొట్టు తీసే మిషన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ గింజలను హిందూపురం, మధురై, చెన్నై, బెంగళూరు, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్‌లకు పంపిస్తారు. అక్కడ పొడి చేసే మిషన్లు కూడా ఉన్నాయి. అందుకే చింత గింజల్ని అక్కడికి పంపిస్తున్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరులో 12 మిషన్ల ద్వారా రోజుకు 200 టన్నుల చింత గింజలను పొట్టు తీసి ప్రక్రియ నడుస్తోంది. అనంతరం గింజల్ని వేరే ప్రాంతాలకు పంపుతున్నారు. ఫార్మా కంపెనీలు మందుల తయారీలో ఈ పొడిని ఉపయోగిస్తారు. వీటితో పాటుగా రంగుల తయారీకి, పట్టు వస్త్రాలకు గంజి పెట్టడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటితో పాటుగా పేపర్, ఫ్లైవుడ్, మస్కిటో కాయిల్స్, ప్లాస్టిక్ వస్తువుల తయారీకి, జూట్ పరిశ్రమలో కూడా ఈ చింత గింజల పొడిని వినియోగిస్తారు. అంతేకాదు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చింత గింజల పొడి మంచి మందు అని చెబుతున్నారు. చింత గింజల వ్యాపారంతో చాలామంది ఉపాధి పొందుతున్నారు.