Flipkart: ప్రముఖ టెక్ కంటెంట్ క్రియేటర్ దేవాన్షు ధండాల్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చెప్పుకచ్చారు. ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మోసగాళ్లైన విక్రేతలను అనుమతిస్తున్నారని, తనకు ఎదురైన సంఘటనను వివరించారు. తాను జాగ్రత్త పడడం వల్ల బయటపడినట్లు వివరించారు. మరి ఇంతకీ మ్యాక్ బుక్ కాకుండా ఏం పంపించారు? టెకీ చెప్పిన విషయాలు మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాన్షు ధండాల్ రూ.2.60 లక్షలు విలువైన బ్రాండ్ న్యూ యాపిల్ మ్యాక్ బుక్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేశాడు. అయితే, రెండుసార్లు పాత మ్యాక్ బుక్ పంపించారని ధండాల్ ఆరోపించారు. తనకు వచ్చిన పాత మ్యాక్ బుక్ ప్యాకింగ్ తెరుస్తున్నప్పుడు తీసిన వీడియోలను వీడియాలోను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మొదటి వీడియోను తన ఇంటిలో తీయగా, రెండోది ఈ-కార్ట్ ఆఫీసులోనే సీసీటీవీ నిఘాలోనే తెరిచారు. తాను దానిని రిటర్న్ చేసేందుకు ప్రయత్నిస్తూ వాటికి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇచ్చిన రూ.13 వేలు, రూ.18 వేలు ఆఫర్‌ను తిరస్కరించానని, చివరకు ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ ప్రక్రియను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇది కేవలం పాడైన ప్రొడక్ట్ గురించి కాదని, ఇది జరుగుతున్న మోసం గురించి అంటూ రాసుకొచ్చారు. () అనే విక్రేత 2023 నుంచి కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. లింక్డ్ ఇన్, రెడ్డిట్, యూట్యూబ్, ఎక్స్‌లో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయినా ఫ్లిప్ కార్ట్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. యాపిల్ బాక్సుల్లో ఎలా నకిలీ, పాత వస్తువులను ప్యాక్ చేస్తున్నారు? తరుచుగా ఫిర్యాదులు వస్తున్నా ఇప్పటికీ ఆ విక్రేతను ఎలా అనుమతిస్తున్నారు? పాత, నకిలీ వస్తువులు వచ్చినప్పుడు ఏ విధంగా కొనుగోలుదారులు నష్టపోకుండా ఫ్లిప్‌కార్ట్ ఏవిధంగా భరోసా కల్పిస్తోంది? అంటూ మూడు ప్రశ్నలు సంధించారు దేవాన్ష్ ధండాల్.మరోవైపు.. ఈ పోస్టు చేసిన కొన్ని గంటల తర్వాత మళ్లీ ఓ పోస్ట్ చేశారు ధండాల్. ఫ్లిప్‌కార్ట్ తన ప్రొడక్ట్ రిటర్న్ చేసేందుకు అంగీకరించిందని, అది చాలా విలువైనది కాబట్టి తిరిగి ఇచ్చేశానని చెప్పుకొచ్చారు. రెండుసార్లు మోసం చేసిన తర్వాత మరోసారి ఆ విక్రేతను నమ్మాలనుకోవట్లేదని తెలిపారు. ఆ విక్రేత ద్వారా మోసపోయిన వారందరికీ రీఫండ్ చేయాలని ఫ్లిప్‌కార్టును డిమాండ్ చేశారు.