భార్య, అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక హనుమకొండలో ఓ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ ఆర్మీ జవాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. హనుమకొండలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అతడ్ని సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణాలు తీసుకునే ముందు రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "డియర్ ఫ్రెండ్స్ నేను చనిపోతున్నా" అంటూ రాసిన లేఖ.. అతడు ఎంతటి నరకయాతన అనుభవించాడో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. విధుల్లోకి వెళ్లకుండా అతని ఐడీ కార్డు దాచి పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. హనుమకొండ మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్‌ అనే వ్యక్తి.. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో ఉన్న టెరిటోరియల్‌ ఆర్మీ 125 బెటాలియన్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2020లో అరికిల్ల ప్రవీణ్‌కు.. పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో పెళ్లి జరిగింది. అయితే అరికిల్ల ప్రవీణ్, రజనిక జంట మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అయితే గత కొంతకాలంగా ఈ గొడవలు తీవ్రం కావడంతో.. భార్య రజనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రవీణ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌ తన ఆర్మీ ఉద్యోగానికి వెళ్లకుండా ఉండేందుకు రజనిక, ఆమె కుటుంబం అతని ఐడీ కార్డు దాచిపెట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్‌ 2 నెలల క్రితం ప్రవీణ్ విధులకు వెళ్లగా.. రజనిక ఆర్మీ బెటాలియన్‌ వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో తన పరువు పోయిందని ప్రవీణ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సెలవుల్లో భాగంగా ఇటీవల ఈనెల 6వ తేదీన ప్రవీణ్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరం హనుమకొండకు వెళ్లాడు. ఈనెల 8వ తేదీన హనుమకొండలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం తన అన్న ప్రసాద్‌కు ఫోన్‌ చేసి.. జరిగిన విషయం చెప్పాడు. దీంతో వెంటనే ప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులు ప్రవీణ్‌ వద్దకు వెళ్లి అతడ్ని హుటాహుటిన తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్‌‌కు అక్కడే చికిత్స అందిస్తుండగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ డాక్టర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. ఇక ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రవీణ్‌ రాసిన సూసైడ్‌ లెటర్ సంఘటనా స్థలంలో దొరికింది. అందులో "డియర్‌ ఫ్రెండ్స్‌ నేను చనిపోతున్నా.. మా అమ్మను మీ అమ్మ లాగా చూసుకోండి. నేను చనిపోవడానికి కారణం ఎవరో అది వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా. అమ్మను జాగ్రత్తగా చూసుకో అన్నా. మన ఊరిలో వాలీబాల్‌ టీమ్‌ బతకాలి. ఎప్పుడూ ఆటను వదలొద్దు" అని తన సూసైడ్ లేఖలో ప్రవీణ్ పేర్కొన్నాడు.