ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూ-శ్రీనగర్‌ ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది.. ఇంజినీర్ల ప్రతిభ కూడా కీలకం. ఈ ఇంజినీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత కూడా పాత్ర కూడా ఉంది. ఆమె గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌కే అంకితమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి చిన్నప్పటి నుంచి చదువులో రాణించారు.. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల బీటెక్‌ (సివిల్) చేయాల్సి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాధవి కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో రీసెర్చ్ (పరిశోధన)వైపు అడుగులువేశారు. అనంతరం మాధవి బీటెక్ పూర్తి చేశారు.. అలా రీసెర్చ్ వైపుగా ప్రయాణంలో ఐఐటీ-మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.పీహెచ్‌డీ తర్వాత ఏడాది పాటూ ఐఐటీ-గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం 2003లో బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో జియోటెక్నికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా రెండేళ్ల పాటూ పనిచేశారు. అక్కడి నుంచి చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్ట్‌లో చేరారు. మాధవి గత 17 ఏళ్లుగా ఈ చినాబ్ ప్రాజెక్ట్‌కు కన్సల్టెంట్‌గా విధుల్లో ఉన్నారు.. రాక్ మెకానిక్స్‌పై పట్టు ఉంది. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్టులో.. అక్కడ ఉన్న శిలలు, వాటి బరువు, గట్టిదనంపై ఆమె పరిశోధనలు చేశారు. ఇలా సుదీర్ఘంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. తనకు చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్టులో పనిచేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అంటున్నారు మాధవి. ఈ బ్రిడ్జి నిర్మాణం చాలా కష్టమని.. రెండు కొండల్ని కలపుతూ వంతనెన నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో కొండలు, రాళ్లు, భూమి గురించి పూర్తిగా అవగాహన ఉండాలి, తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టులో చేరిన సమయంలో ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి తన టీమ్‌తో కలిసి మొదటిసారిగా చినాబ్ నదిపై బోట్‌లో ప్రయాణించానని గుర్తు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేసిన ప్రాంతంపై అధ్యయనం చేశామని.. కొండలు కూడా ఎక్కామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఇబ్బంది లేకుండా.. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించేలా ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులకు తిగిన విధంగా.. ఎప్పటికప్పుడు తమ ఆలోచనలను మార్చుకున్నామన్నారు. మొత్తానికి వందేళ్ల కల నెరవేర్చామని.. దేశం గర్వించదగ్గ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తన అదృష్టమని.. ఎంతో గర్వంగా ఉందన్నారు. అంతేకాదు 2021లో మాధవికి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ వేడుకల్లో భాగంగా ఐఐఎస్‌సీ ప్రకటించిన ‘75 మంది స్టెమ్ మహిళా నిపుణుల’ జాబితాలో స్థానం దక్కింది.చినాబ్ రైల్వే వంతెన నమూనా, దాని నిర్మాణ శైలి భిన్నంగా ఉంటాయి. వాస్తవానికి 137 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పాలనలోనే ఈ రైల్వే లైన్ ఆలోచన తెరపైకి వచ్చింది. 2002లో నిర్మాణ పనులు ప్రారంభించగా మొత్తానికి 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా చినాబ్ ఉక్కు వంతెనకు గుర్తింపు ఉంది. ఈ బ్రిడ్జి ఎత్తు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఈ బ్రడ్జి నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కు.. దాదాపు నాలుగు ఈఫిల్ టవర్స్ నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కుతో సమానం. అలాగే దాదాపు 120 ఏళ్లు బలంగా ఉండేలా ఈ వంతెన నిర్మాణం జరిగింది.