టీడీపీ అధ్యక్షుడు ఇంట్లో విషాదం నెలకొంది. పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూశారు. 93 ఏళ్ల పల్లా సింహాచలం.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పల్లా సింహాచలం తుదిశ్వాస విడిచారు. పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం -2 నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్లా సింహాచలం కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1983 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. 1989 ఎన్నికలలో పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 1994 ఎన్నికలలో విశాఖపట్నం- II నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి మరియదాస్ మీద గెలుపొంది.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999 ఎన్నికలలో దూరంగా ఉన్న ఆయన.. 2004 ఎన్నికలలో విశాఖపట్నం- II నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మరోవైపు పల్లా సింహాచలం రాజకీయ వారసుడిగా పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి పల్లా శ్రీనివాసరావు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన పల్లా శ్రీనివాసరావు 2014లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ కోసం పనిచేశారు. 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పల్లా శ్రీనివాసరావు.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీద భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. కింజరాపు అచ్చెన్నాయుడును మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు.. ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు.