జనసైనికులను, పార్టీ నేతలను ఉద్దేశిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటూ అందులో హెచ్చరించింది. ఈ మేరకు జనసేన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి లేఖ విడుదల చేసింది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్ పెట్టి ఈ లేఖను సోషల్ మీడియాలో జనసేన పార్టీ పోస్ట్ చేసింది. పార్టీలోని కొంతమంది నేతలు.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ దాటుతున్నారని జనసేన అందులో పేర్కొంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జనసేన పాలసీపైనా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికై చేస్తున్న కృషి, జనసేన పార్టీ వ్యూహాల గురించి అధ్యక్షుడు సభలు, సమావేశాలలో ఎప్పటి కప్పుడు తెలియజేస్తూనే ఉన్నారని జనసేన లేఖలో పేర్కొంది. అయినా కూడా అక్కడక్కడా కొందరు నేతలు పార్టీ లైన్‌ను విస్మరించి మాట్లాడుతున్నారని తెలిపింది. ఆ మాటలు ఇటు ప్రజలలోనూ, అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయని.. పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందంటూ లేఖలో జనసేన హెచ్చరించింది. జనసేన లేఖ.. ఆయన్ని ఉద్దేశించేనా?అయితే జనసేన పార్టీ ఎవరిని ఉద్దేశించి ఈ ప్రకటన చేసిందనేదీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ సంబరాలు కాస్తా తీవ్ర విషాదంగా మారిపోయాయి. అయితే బెంగళూరు తొక్కిసలాట ఘటనను.. హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ముడిపెడుతూ జనసేన నేత గురువారం ట్వీట్ చేశారు. "ఎవరి వైఫల్యమో పక్కనపెడితే పుష్ప 2 సినిమా విడుదల రోజున ఒక నిండు ప్రాణం బలయ్యింది.. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దానికి అల్లు అర్జున్‌ను బాధ్యుణ్ని చేసి రాసి రాంపాన్న పెట్టారు. నిన్న కర్ణాటకలో క్రికెట్ సంబరాలలో జరిగిన తొక్కిసలాటలో 11 నిండు ప్రాణాలు బలైనాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కన్నా ముఖ్యంగా మనం శోధించాల్సింది తప్పు ఎక్కడ జరిగిందని.. నేర్చుకోవలసింది ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే.. కక్ష సాధింపు ధోరణి మంచిది కాదని మనవి చేస్తున్నా.. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదు అంటే భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.. భాద్యతగా వ్యవహారించాలి.. అంటూ బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు. అయితే బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్.. కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ఉండటంతో.. జనసేన పార్టీ లైన్ ప్రకటన ఆయనను ఉద్దేశించేనా అనే చర్చలు జరుగుతున్నాయి. బెంగళూరు తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్ కళ్యాణ్.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.