తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించగా గత మూడ్రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.మాగంటి గోపీనాథ్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్య పరీక్షలలో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం లేదని (కిడ్నీ ఫెయిల్యూర్) నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. గతంలో కూడా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఈనెల 5న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి మరింత క్షీణించి, అనూహ్యంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర కీలక నాయకులు ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని అయన్ను పరామర్శించారు. గత మూడ్రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానంజూన్ 2, 1963న జన్మించిన మాగంటి గోపీనాథ్.. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీలో ఉంటూ..తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రజల మన్ననలు పొందారు. 2014, 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.