వేసవి సెలవులు అయిపోవస్తుండటం, వీకెండ్ కావడంతో శనివారం తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ కొనసాగింది. ఇక భక్తులకు అందిస్తున్నసేవలను తనిఖీ చేయడం కోసం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సిబ్బందితో కలసి శనివారం నాడు సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ లగేజీ స్కానింగ్ కేంద్రంలో పని చేసే సిబ్బందితో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్యామలరావు, ఇతర అధికారులు.. భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన దివ్య దర్శనం టోకెన్లు జారీకి సంబంధంచి.. అన్ని కౌంటర్ల పని తీరును పరిశీలించారు. ఆ తర్వాత ఆయన భక్తులతో మాట్లాడి.. టోకెన్ల జారీ ప్రక్రియపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్య దర్శనం టోకెన్ల జారీకి సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు రావడం వల్లనే.. శుక్రవారం సాయంత్రం టోకెన్ల జారీని భూదేవి కాంప్లెక్స్‌కు తాత్కలికంగా మార్చామని వెల్లడించారు.అంతేకాక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లే రోజుకు సగటున 5,000 దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం పటిష్టంగా ఉందన్నారు. అలానే భక్తులకు సౌకర్యవంతంగా రవాణా వసతులు, భద్రతా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాక శ్రీనివాస మంగాపురంలో కూడా టోకెన్లు జారీ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఆర్కియాలజీ విభాగం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. పర్మిషన్ వచ్చిన వెంటనే.. శ్రీనివాస మంగాపురంలో కూడా టోకెన్లు జారీ చేస్తామని శ్యామలరావు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వేస‌వి సెల‌వులు ముగింపుకు వస్తుండటంతో.. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ.. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చర్యలు తీసుకుంటుంది. అలానే కంపార్టుమెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసేలా టీటీడీ చర్యలు తీసుకుంది. దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి చూడాల్సి వస్తోంది.