పాకిస్తాన్ మాజీ క్రికెటర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు. ఇండియా - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలోనూ అఫ్రిది చాలా సందర్భాల్లో నోరు పారేసుకున్నాడు. క్రికెట్‌లో అయినా.. ధైర్యంలో అయినా.. చివరికి టెక్నాలజీలో అయినా పాకిస్తాన్ కంటే భారత్ పదేళ్లు వెనకే ఉందంటూ కామెంట్స్ చేశాడు. అఫ్రిది అహంకారంతో కూడిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఓ హై ఓల్టేజ్ వైబ్ ఉంటుంది. అయితే కొంతకాలంగా ఈ మ్యాచ్‌లన్నీ వన్ సైడ్ అయ్యాయి. భారత్ ముందు పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోతూనే ఉంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఏ వేదికైనా విజయం భారత్‌దే. అలాంటి సత్తాను తక్కువ చేస్తూ దాయాది ప్లేయర్ షాహిద్ అఫ్రిది అహంకారంతో కూడిన కామెంట్స్ చేశాడు. క్రికెట్‌లో పాకిస్తాన్ కంటే భారత్ పదేళ్లు వెనుకే ఉందన్నాడు. భారత్‌ను పోటీకి పిలవడానికి కూడా తమకు అవమానంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. "భారతదేశం పాకిస్తాన్ కంటే పదేళ్లు వెనకబడి ఉంది. క్రికెట్, గుండె ధైర్యం, టెక్నాలజీ ఇలా ఎందులో చూసుకున్నా పదేళ్లు వెనకే ఉంది. అసలు వాళ్లని మా ప్రత్యర్థిగా పిలవడానికి కూడా మాకు అవమానంగా ఉంది" అంటూ షాహీద్ అఫ్రిది కామెంట్స్ చేశాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనూ షాహిద్ అఫ్రిది నోరు పారేసుకోగా.. శిఖర్ ధవన్ కౌంటర్ అటాక్ కూడా చేశాడు. ఇరుదేశాలు కాల్పుల ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఈ పోరులో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ అఫ్రిది విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాడు. తాజాగా షాహీద్ అఫ్రిది భారత్‌పై చేసిన కామెంట్స్‌కు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి ఇలాంటి వాళ్లే నాంది పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో రాణించి ఇమ్రాన్ ఖాన్‌లా ప్రధానమంత్రి అవ్వడానికి అఫ్రిది ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.