'WTC Finalలో సౌతాఫ్రికా గెలిస్తే.. టెస్టు క్రికెట్ గతే ఛేంజ్ అవుతుంది'

Wait 5 sec.

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. జూన్ 11 నుంచి లార్డ్స్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడుగుపెట్టిన సఫారీలు ఎలాగైనా ట్రోఫీతోనే సౌతాఫ్రికా వెళ్లాలని ఫిక్సయ్యారు. వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతున్న కంగారులు డబ్ల్యూటీసీ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ప్రపంచ క్రికెట్‌లో చోకర్స్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా జట్టు ఈ సారి ఎలాగైనా ఆ పేరును పోగొట్టుకోవాలని ఉంది. టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా భారత్‌పై విజయపు అంచుల వరకూ వెళ్లి ఓడిపోయింది. ఛాంపియన్స్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, మాజీ కోచ్ కూడా తమ జట్టుపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ బిగ్ ఫైట్ కళ్లారా చూసేందుకు సౌతాఫ్రికా నుంచి ఎంతో మంది లండన్ వస్తున్నారని, తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారని చెప్పాడు. డబ్ల్యూటీసీ ట్రోఫీ అందుకుంటే సౌతాఫ్రికాలో టెస్టు క్రికెట్ గతి పూర్తిగా మారిపోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. "మేము ట్రోఫీ ఆడుతున్నాము. చాలా మంది మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలవమని అనుకుంటున్నారు. టెస్టు క్రికెట్‌లో పరిస్థితులు వేరుగా ఉంటాయి.. ఐదు రోజులు జరిగే ఆటలో ఏదైనా జరగొచ్చు. అవునూ మాకు చోకర్స్ అనే ట్యాగ్ ఉంది, మేం ట్రోఫీ గెలిస్తే తప్పితే అది వెళ్లదు. ఒకవేళ మేం గెలిస్తే.. మా దేశంలో టెస్టు క్రికెట్ గతే మారిపోతుంది" అని మార్క్ బౌచర్ అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో సౌతాఫ్రికా వరుసగా ఏడు విజయాలతో టాప్ ప్లేస్‌లో నిలవగా, బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండేళ్ల కాలంలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. ఆ ఫైనల్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందుతుంది. 2019లో మొదలైన ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిన్ ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తయింది. 2019-21, 2021-23లో భారత్ వరుసగా ఫైనల్స్‌కు చేరుకుని రెండుసార్లూ ఓడిపోయింది. 2019-21లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలవగా, 2021-23లో ఆస్ట్రేలియా గెలిచింది. మరి ఇప్పుడు సౌతాఫ్రికా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా? లేక చోకర్స్‌గా మిగిలి మళ్లీ ఆసీస్ చేతిలో ట్రోఫీ పెడుతుందా? అనేది వేచి చూడాలి.