జులై నుంచి కొత్త రూల్స్.. ఆ గడువు దాటితే GST రిటర్న్స్ ఫైలింగ్ కుదరదు

Wait 5 sec.

: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. కీలక మార్పులు రాబోతున్నాయి. ఇకపై జీఎస్‌టీ నెలవారీ, వార్షిక రిటర్నులు ఆలస్యం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిర్దేశిత గడువు తేదీ తర్వాత మూడేళ్లకు మించి ఆలస్యం చేసినట్లయితే ఆ తర్వాత వాటిని సమర్పించడం కుదరదు. 2025 జులై పన్ను కాలం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. జులై నుంచి ట్యాక్స్ టైం అంటే జులై నెలకు సంబంధించి రిటర్నులు ఆగస్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. జీఎస్‌టీ () రిటర్నుల వాస్తవ గడువు తేదీ నుంచి మూడేళ్ల సమయం దాటినట్లయితే జీఎస్‌టీఆర్- 1, జీఎస్‌టీఆర్ 3బీ, జీఎస్‌టీఆర్ 4, జీఎస్‌టీఆర్ 5, జీఎస్‌టీఆర్ 5ఏ, జీఎస్‌టీఆర్ 6, జీఎస్‌టీఆర్ 7, జీఎస్‌టీఆర్ 8, జీఎస్‌టీఆర్ 9 లు ఫైలింగ్ చేసేందుకు ఫైనాన్స్ యాక్ట్ 2023కి అనుగుణంగా ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. 'మూడు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేయడం నిషేధించడం జరిగింది. జులై 2025 పన్ను కాలం నుంచి జీఎస్‌టీ పోర్టల్‌లో ఈ కొత్త పరిమితులు అమలు చేయబడతాయి.' అని అడ్వైజరీలో స్పష్టం చేసింది జీఎస్‌టీఎన్. ఇప్పటి వరకు రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్లు సాధ్యమైనంత మేరకు త్వరగా పూర్తి చేయాలని సూచించింది. నెలవారీ జీఎస్‌టీ పేమెంట్లకు సంబంధించిన జీఎస్‌టీఆర్ 3బీ ఫారంలో పన్ను చెల్లింపుదార్లు ఇకపై ఎలాంటి మార్పులు చేయడం కుదరదు. 2025, జులై నుంచి అమలయ్యే పన్ను కాలంనుంచి ఇది నాన్ ఎడిటబుల్ ఫారంగా మారుతుందని జీఎస్‌టీ నెట్‌వర్క్ స్పష్టం చేసింది. మరోవైపు.. గత ఏడాది 2024 అక్టోబర్ నెలలోనే ట్యాక్స్ పేయర్లను అలర్ట్ చేసింది జీఎస్‌టీ నెట్‌వర్క్. 2025 తొలినాళ్లలోనే జీఎస్‌టీ రిటర్నుల కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని, రిటర్నులు ఫైలింగ్‌కు టైమ్ లిమిట్ విధిస్తున్నట్లు హెచ్చరించింది. ఈ కొత్త రూల్స్ వల్ల వ్యవస్థలో క్రమశిక్షణ అలవడుతుందని, మార్గదర్శకాలు పాటిస్తారని పన్ను నిపుణులు చెబుతున్నారు. అయితే, లిటిగేషన్, సిస్టమ్ సమస్యలు, ఇతర నిజమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగిస్తుందంటున్నారు. జీఎస్‌టీ చట్టానికి పార్లమెంట్ 2016లో ఆమోదం తెలిపింది. వస్తు సేవల పన్నును జులై 1, 2017లో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చినట్లయింది. అయితే, కొంత గందరగోళం నెలకొన్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతుంటారు. ఆ తర్వాత చాలా మార్పులు చేస్తూ వచ్చింది కేంద్రం.