తెలంగాణ చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అదిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఈ దఫా ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో రేవంత్ జట్టులోకి చేరనున్నారు. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా రాజ్‌భవన్ పంపించారు. మధ్యాహ్నం 12-12.20 గంటల మధ్య గవర్నర్ జిష్టుదేవ్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారి పేర్లు వెల్లడించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి (ఎస్సీ - మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీ - మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ (బీసీ - ముదిరాజ్)లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు దక్కించుకుంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాడిక వర్గానికి చెందిన రామచంద్రు నాయక్‌ పేరను ఖరారు చేశారు. ఈ మేరకు వారికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యేకు చిక్కినట్లే చిక్కి మంత్రి పదవి చేజారింది. అప్పటి వరకు ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి నిమిషంలో మంత్రి పదవి మిస్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనగా.. రేసులో మానకొండూరు ఎమ్మెల్యే , అడ్లూరి లక్ష్మణ్ పేర్లు తెరపైకి వచ్చాయి. కవ్వంపల్లికే మంత్రి పదవి ఖాయమని దాదాపుగా డిసైడ్ అయ్యారు. కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు కూడా కవ్వంపల్లికే ఎక్కువ ఛాన్స్ ఉందని ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. అయితే చివరి నిమిషంలో కవ్వంపల్లిని కాదని.. అడ్లూరిని ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారనికి సిద్ధం కావాలని చెప్పారు. దీంతో కవ్వంపల్లి సత్యనారాయణ వర్గీయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నిన్నటి నుండి కవ్వంపల్లికి మంత్రి పదవి ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరగ్గా.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో మంత్రి పదవి చేజారడంతో కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు సమాచారం. అధిష్టానం కూడా మెుదట ఎమ్మెల్యే కవ్వంపల్లి పేరును పరిశీలించినప్పటికీ.. పార్టీలో అంతర్గత అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కవ్వంపల్లికి తీవ్ర నిరాశే ఎదురైంది.