పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పాడి రైతులకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గోకులం షెడ్లు నిర్మిస్తున్నారు. అలాగే ఏర్పాటు చేస్తు్న్నారు. తాజాగా పశువుల దాణాను కూడా ఏపీ ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. పశువులకు పశుగ్రాసం కొరత రాకుండా.. అలాగే పాల దిగుబడి తగ్గకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం 50 శాతం రాయితీతో పశువుల దాణాను అందిస్తోంది. అయితే ఇందుకు కొన్ని అర్హతలు, నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. తెల్లరేషన్‌ కార్డు కలిగిన పాడి రైతులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.*మరోవైపు ప్రభుత్వం 50 కేజీల బస్తా చొప్పున సమీకృత దాణాను రాయితీపై అందిస్తోంది. 50 కిలోల బస్తా పశువుల దాణా విలువ రూ.1110. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం రాయితీపై బస్తాను రూ.555లకే పాడి రైతులకు అందజేస్తోంది. రెండు ఆవులు లేదా గేదెలు, ఒక దూడకు 50 కిలోల బస్తా చొప్పున అందిస్తున్నారు. మొత్తంగా మూడు బస్తాలను ఒకసారి అందిస్తున్నారు. అంటే 150 కిలోల పశువుల దాణాను ఒకసారి కింద రాయితీపై అందిస్తున్నారు. మూడు విడతలుగా 450 కిలోల పశువుల దాణా 50 శాతం రాయితీపై అందించనున్నారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన సన్న, చిన్నకారు రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిష్పత్తి ఆధారంగా పశువుల దాణా కేటాయించనున్నారు. *మరోవైపు 20 శాతం ప్రోటీన్ కలిగిన ఈ పశువుల దాణాను ప్రభుత్వం తొలిసారిగా రాయితీపై అందిస్తోంది. రైతు సేవా కేంద్రాలతో పాటుగా, పశు వైద్యశాలల ద్వారా కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.69 కోట్లు ఖర్చు చేస్తోంది. మొత్తంగా 31,067 టన్నుల దాణా పంపిణీకి ఏపీ పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకుంది. పశుగ్రాసం కొరతను అధిగమించటంతో పాటుగా నిలకడగా పాల దిగుబడి పొందేందుకు, పశువుల విక్రయాలను నిలువరించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటోంది. అర్హత కలిగిన ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఏపీ పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.