హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేలా.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.,

Wait 5 sec.

హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల అందాల పోటీలు కూడా నిర్వహించారు. తాజాగా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ సిటీగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సిని సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సిద్ధం చేయాలని తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ అధికారులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం మల్లు , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమైంది.ఈ సమావేశంలోనే అంతర్జాతీయ సినీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ సినీ ఇండస్ట్రీలను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సినీ ఇండస్ట్రీకి అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. సినిమా షూటింగ్‌ల కోసం ఫైర్ సిబ్బంది, మున్సిపాలిటీ, పోలీసుల అనుమతులు కావాల్సి ఉంటుంది. ఈ అనుమతుల కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసే అవసరం లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఒక ఆఫీసర్‌ను కూడా ప్రత్యేకంగా నియమించనున్నారు. అలాగే థియేటర్లలో తినుబండారాల ధరలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్లు.. సినిమా టికెట్ల కంటే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా హాళ్లల్లో తినుబండారాల రేట్లను నియంత్రించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు స్పష్టం చేసింది.మరోవైపు ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భూములపైనా కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిలిం డెవలప్‌‍మెంట్ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం గతంలో 50 ఎకరాలు భూమి కేటాయించింది. అయితే ఆ భూమిలో నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో చెప్పాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 14న గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆ రకంగా ఏర్పా్ట్లు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు.