అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడు.. ఎవరీ శుభాంశు శుక్లా?

Wait 5 sec.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్‌లోకి కాలు పెట్టే మొట్టమొదటి భారతీయుడిగా అయ్యారు. దీంతో ఇప్పుడు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. బుధవారం (జూన్ 11) భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు యాక్సియమ్-4 ప్రయోగంలో భాగంగా అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌లో శుభాంశు శుక్లాతోపాటు వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కపు, పెగ్గి విట్సన్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఇక ఐఎస్ఎస్‌కు చేరుకోనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్న శుభాంశు శుక్లా చిన్ననాటి కలలు, దృఢ సంకల్పం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.శుభాంశు శుక్లా తండ్రి శంభు దయాల్ శుక్లా, అక్క శుచి శుక్లాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2001 డిసెంబర్‌లో తన అక్క పెళ్లి జరుగుతున్న సమయంలో 14 ఏళ్ల శుభాంశు శుక్లా కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చాలా సేపు వెతికారు. చివరికి సైకిల్‌పై తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా.. బాక్సీ-కా-తలాబ్ వద్ద జరిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌షో చూసి తాను ప్రేరణ పొందినట్టు తెలిపాడు. అందుకే రహస్యంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షకు వెళ్లి వచ్చినట్లు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 1999లో భారత్-పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం శుభాంశు శుక్లాపై తీవ్ర ప్రభావం చూపిందని.. అందుకే ఎన్‌డీఏలో చేరాలని నిర్ణయించుకున్నాడని శుచి శుక్లా తెలిపారు. ఎవరికీ చెప్పకుండానే ఫ్రెండ్ దగ్గరి నుంచి ఎన్‌డీఏ అప్లికేషన్ తెచ్చుకొని పరీక్ష రాసిన శుభాంశు.. పాస్ అయిన తర్వాతే తమకు అసలు విషయం తెలిసిందని ఆమె గుర్తు చేసుకున్నారు.మొదట తన కుమారుడు ఆర్మీ లేదా ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాను అని చెప్పినపుడు మందలించిన తండ్రి శంభు దయాల్ శుక్లా.. ఇప్పుడు శుభాంశు శుక్లాకు వచ్చిన అవకాశం చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. వ్యోమగామి కావాలని చెప్పినప్పుడు ఆయన తల్లి కూడా ఆందోళన చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఎన్‌డీఏ పరీక్ష విషయంలో చేసినట్లే.. గగన్‌యాన్ మిషన్‌కు కూడా శుభాంశు శుక్లా రహస్యంగా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 39 ఏళ్ల వయసు ఉన్న శుభాంశు శుక్లా.. తన తల్లిదండ్రులకు ముగ్గురు సంతానంలో చివరివాడు. శుభాంశు శుక్లా భార్య కామ్నా డెంటిస్ట్ కాగా.. వారికి కియాష్ అనే 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వారి కుటుంబం నుంచి సాయుధ దళాలలో చేరిన మొదటి వ్యక్తి శుభాంశు శుక్లానే అని ఆయన తండ్రి తెలిపారు.యుద్ధ అనుభవం, పైలట్‌గా నైపుణ్యంశుభాంశు శుక్లా 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేరారు. అతను ఫైటర్ కాంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలట్‌గా ఎదిగారు. ముఖ్యంగా 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో శుభాంశు శుక్లా చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో అతడు తన కుటుంబంతో కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు. సుఖోయ్-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్‌తో పాటు హాక్ వంటి ఫైటర్ జెట్‌లను 2 వేల గంటలకు పైగా నడిపిన విశేష అనుభవం శుభాంశు శుక్లా సొంతం.ఎన్‌డీఏ నుంచి గగన్‌యాన్ వరకు శుభాంశు శుక్లా ఏ విషయంలోనూ, ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని.. ఈ మిషన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేస్తాడని ఆయన కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి తొలిసారి ఐఎస్ఎస్‌కు వెళ్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు మనందరం శుభాకాంక్షలు తెలుపుదాం.