నికోలస్ పూరన్ రిటైర్మెంట్.. 29 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై!

Wait 5 sec.

కరేబియన్ హిట్టర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతి చిన్న వయస్సులోనే పూరన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ ప్రపంచం షాక్‌లో ఉంది. 29 సంవత్సరాల పూరన్ వెస్టిండీస్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పూరన్.. టీ20 లీగ్స్‌లలో మాత్రం కొనసాగనున్నాడు. మరో 8 నెలల్లో టీ20 వరల్డ్‌కప్ ఉండగా పూరన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంతో వెస్టిండీస్ క్రికెట్ అభిమానులు విస్మయానికి గురయ్యారు. నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి 4000కి పైగా పరుగులు చేశాడు. టీ20ల్లో 2275, వన్డేల్లో 1983 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలవడం విశేషం. రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు తనను సెలక్ట్ చేయొద్దంటూ పూరన్ రిక్వెస్ట్ చేశాడు. రిటైర్మెంట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పూరన్ అధికారింగా వెల్లడించాడు. చాలా ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చానని, ఇది చాలా కష్టతరమని కూడా నాకు తెలుసంటూ నికోలస్ పూరన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "ఎన్నో ఆలోచనలు చేసిన తర్వాతే నేను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. మనం ఇష్టపడే ఈ ఆట చాలానే ఇచ్చింది, ఇంకా ఇస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు, ఆనందాలు ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం నాకు దక్కింది. మెరూన్ జెర్సీ వేసుకుని, జాతీయ గీతం ఆలపించడం ఇదంతా నేను మాటల్లో వివరించలేను. కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వకారణం. అభిమానులు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నా కెరీర్‌లో నాకు అండగా నిలబడిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు థాంక్స్" అంటూ పూరన్ తన ఇన్‌స్టాగ్రామ్ నోట్‌లో రాసుకొచ్చాడు. వెస్టిండీస్ తరఫున 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పూరన్, పాకిస్తాన్‌పై తన మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడాడు. మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై మొదటి వన్డే ఆడాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో వెస్టిండీస్ స్క్వాడ్‌లో ఉన్న పూరన్ ఆ తర్వాత కెప్టెన్‌గా కూడా చేశాడు. పూరన్ చివరగా బంగ్లాదేశ్‌పై 2024 డిసెంబర్‌లో టీ20 క్రికెట్ ఆడాడు.