టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా మూడు వరల్డ్‌కప్‌లు అందించిన మిస్టర్ కూల్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఏడుగురు ఆటగాళ్లతో కొత్తగా ప్రకటించిన ఈ జాబితాలో ధోనీకి అవకాశం కల్పించారు. లండన్ వేదికగా సోమవారం ప్రకటించిన ఈ జాబితాలో ఎంఎస్ ధోనీతో పాటు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్, సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్ గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, న్యూజిలాండ్ ప్లేయర్ డానియల్ వెటోరి, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్, పాకిస్తాన్‌కు చెందిన సనాకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 17,266 పరుగులు చేశాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ధోనీ కూడా స్పందించాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం చాలా గౌరవంగా ఉందన్నాడు. దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన పేరును కూడా గుర్తుంచుకోవడం ఎప్పటికీ నిలిచిపోయే అనుభూతి అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల సహకారాన్ని గుర్తించి అందులో తన పేరును కూడా చేర్చడాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 11వ భారతీయుడిగా నిలిచాడు. ధోనీ కంటే ముందు పది మంది భారతీయ క్రికెటర్లు ఇందులో చోటు దక్కించుకున్నారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2009లో తొలిసారిగా బిషన్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. 2015లో అనిల్ కుంబ్లే, 2018లో రాహుల్ ద్రవిడ్, 2019లో సచిన్ టెండూల్కర్, 2021లో వినూ మన్కడ్, 2023లో డయానా ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్, 2025లో ఎంఎస్ ధోనీ ఈ గౌరవం పొందారు.