విజయవాడలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలోనే శాతవాహన కాలేజీని కూల్చివేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాత్రికి రాత్రే ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను కూల్చివేశారు. అనంతరం బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా శాతవాహన కాలేజీ వార్తల్లో నిలుస్తోంది. శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం.. అందులో అధికార పార్టీకి చెందిన నేత పేరు తెర పైకి రావటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బోయపాటి అప్పారావు అనుచరులు కాలేజీ భవనాలను నేలమట్టం చేశారు. ఈ స్థలం తమకే చెందుతుందంటూ బోర్డులు పాతారు.మరోవైపు శాతవాహన కాలేజీ కూల్చివేత వ్యవహారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు కాలేజీ భవనాలను కూల్చివేయటంతో శిథిలాల కింద విద్యార్థుల రికార్డులు చిక్కుకుపోయాయంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ మండిపడుతున్నాయి. కాలేజీ కూల్చివేతలపై విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు, సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చేశారని మండిపడుతున్నారు. ఈ కాలేజీకి దశాబ్ధాల చరిత్ర ఉందని.. అలాంటి కాలేజీని కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శాతవాహన కాలేజీ వివాదం.. అసలేంటీ?మరోవైపు విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న విశాలాంధ్ర రోడ్డులో శాతవాహన కాలేజీ ఉంది. శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ దీనిని నిర్వహిస్తోంది. అయితే శాతవాహన కాలేజీ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు నాటారు. ఈ క్రమంలోనే శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్‌ను ఇటీవల కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత పేరు కూడా వినిపించింది. అయితే కేసు నమోదు కావటంతో.. అనంతరం ప్రిన్సిప‌ల్‌ను వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే బోయపాటి అప్పారావు అనుచరులు బుల్డోజర్ల సహాయంతో కాలేజీ బిల్డింగ్‌లను కూల్చివేశారు. మరోవైపు బోయపాటి అప్పారావు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఈ స్థలం దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అధీనంలోనే ఉంది. అయితే కొంతకాలం నుంచి అప్పారావు ఈ స్థలం తనదంటూ చెప్తున్నారు. హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. స్థలం సొసైటీకే చెందుతుందని తీర్పునిచ్చింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ అప్పారావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో కూల్చివేతలు ప్రాధాన్యం సంతరించుకుంది.