తెలంగాణలోని మహిళలకు గుడ్‌న్యూస్. (ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళలకు సర్కార్ దసరా కానుకగా చీరలు అందించనుంది. 65 లక్షల మంది మహిళల కోసం చేపట్టిన ఉచిత చీరల తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గతంలో రద్దు చేయబడిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఏటా రెండేసి చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం రూ. 318 కోట్లు కేటాయించగా.. ఏప్రిల్ 2025లో చీరల తయారీ ప్రారంభమైంది.గత మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే 1.25 కోట్ల మీటర్లతో 25 లక్షల చీరల తయారీ దాదాపు పూర్తయింది. మరో 40 లక్షల చీరల తయారీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. మొత్తం 4.5 కోట్ల మీటర్లతో 65 లక్షల చీరల తయారీని ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చేనేత, జౌళి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సిరిసిల్లలోనే ప్రధానంగా చీరల తయారీ జరిగేది. అయితే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మరో 11 ప్రాంతాలకు చెందిన కార్మికులకు కూడా ఆర్డర్లు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 131 పరస్పర సహాయ సహకార సంఘాలు, 56 చిన్నతరహా పరిశ్రమల యూనిట్ల కింద ఈ పనులు జరుగుతున్నాయి.ఈ చీరల తయారీ ద్వారా 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించింది. ఒక్కో కార్మికుడు నెలకు సుమారు రూ. 25 వేల వరకు వేతనం పొందుతున్నారు. వారికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరుపుతున్నారు. చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ నిపుణులతో చర్చించిన అనంతరం తుది డిజైన్లను రూపొందించగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటికి ఆమోదం తెలిపారు. 60 ఏళ్ల లోపు మహిళలకు 6 మీటర్ల పొడవు గల పాలిస్టర్ చీరలు, 60 ఏళ్లు దాటిన వారికి 9.5 మీటర్ల పొడవు గల పాలికాటన్ చీరలు అందించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని 48 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని 17 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం ఏకరూప ఉచిత చీరల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నామని చేనేత కమిషనర్ శైలజారామయ్యర్ వెల్లడించారు. నిత్యం పనులను పర్యవేక్షిస్తూ ఏ మాత్రం లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దసరా పండుగ నాటికి చీరలను పంపిణీ చేసేలా పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.