నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం ప్రస్తుత ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుసంధానించబడిన ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ – యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్నాయి.ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వర్షం అంచనాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దన్నారు. పొలం పనులు చేసేవారు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు, ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.