విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుటుంబానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 2009 బ్యాచ్‌కు చెందిన తోటి ఎస్‌ఐలు అండగా నిలిచారు. దాదాపు 1100మంది అశోక్ సొంత ఊరు నరసాపురం వెళ్లి.. ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు.. 2009 ఎస్‌ఐల బ్యాచ్‌ తరపున ఏర్పాటు చేసిన వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా సాయం అందించారు. అశోక్ కుటుంబానికి రూ. 26 లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఇదే ఘటనలో చనిపోయిన కానిస్టేబుల్‌ బ్లెస్సన్‌ జీవన్‌ సొంత ఊరు ఆలమూరు వెళ్లి.. జీవన్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. 2009 బ్యాచ్ ఎస్‌ఐలు అందరూ కలిసి 2020లో వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీ ద్వారా వారి బ్యాచ్‌కి చెందినవారిలో ఏ కుటుంబానికి అవసరం వచ్చినా ఆదుకుంటున్నారు. ఈ సొసైటీ ద్వారా ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించారు. 2009 బ్యాచ్‌‌మేట్‌లు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 2009 బ్యాచ్‌ ప్రారంభించిన ఈ వెల్ఫేర్ సొసైటీని మిగిలిన వారు కూడా ఏర్పాటు చేసి తోటివారికి అండగా నిలివాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరూ కలిసి చేతులు కలిపితే ఏదైనా సాధ్యం అంటున్నారు. అశోక్ 2009లో ఎస్సైగా సెలక్ట్ అయ్యారు.. ఆయా పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. ఆయన తన సోదరి కుమార్తె శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నారు.. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బీటెక్ ఫస్టియర్ చదువుతుండగా.. చిన్నకుమారుడు విఖ్యాత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆలమూరు ఎస్ఐ అశోక్ గత నెల 26న విధి నిర్వహణలో భాగంగా ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి హైదరాబాద్ బయల్దేరారు. ఈ క్రమంలో తెలంగాణలోని కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్‌తో పాటుగా కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సంతాపాన్ని వ్యక్తం చేశారు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 'కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరం. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ లు మరణించడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ లకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. విధినిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎస్‌ఐ అశోక్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.. ఇలాంటి కష్టసమయంలో ఆయన బ్యాచ్‌మేట్స్ అండగా నిలిచారు.